పవన్ ఉల్లి ట్వీట్.. మిస్ ఫైర్?

Update: 2019-12-09 09:44 GMT
కొన్ని విషయాల్ని ఇట్టే రాజకీయం చేయొచ్చన్న భావనలో రాజకీయ నేతలు ఉంటారు. ఇవాల్టి రోజులు ప్రజలు అంత అమాయకంగా ఏమీ లేరు. ఏం చెప్పినా నమ్మేయటానికి పాత రోజులు కావు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్. అందులో డేటా ఉన్న నేపథ్యంలో.. ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్న పరిస్థితి. ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు? దాని వెనుక కారణాలేమిటన్న విషయాన్ని కూడా అర్థం చేసేసుకుంటున్నారు.

ఇలాంటివేళ.. సంబంధం లేని రెండు అంశాల్ని కలిపే ప్రయత్నం చేసి.. దాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లింకు పెట్టాలనుకోవటానికి మించిన పొరపాటు మరొకటి ఉండదు. తాజాగా అలాంటి తప్పే చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బాబుకు జిరాక్స్ గా మారారన్న ఆరోపణలకు తగ్గట్లే పవన్ తాజా ట్వీట్ అదే ధోరణిలో ఉండటం ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన వేళ.. ఉల్లి దండను మెడలో వేసుకొని హడావుడి చేశారు చంద్రబాబు. ఆయనకు తగ్గట్లే తాజాగా చేసిన ట్వీట్ లో ఉల్లి ధరల్ని ప్రస్తావిస్తూ పవన్ చేసిన ట్వీట్ లో పస లేకపోగా.. మిస్ ఫైర్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. ఉల్లి ధరల మీద రాష్ట్రాలు చేసేదేమీ లేదని.. దేశం మొత్తం ఉల్లి మంటలు ఉన్నప్పుడు అది జగన్ కో.. కేసీఆర్ కో పరిమితం కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయితే.. ఈ లాజిక్ ను పట్టించుకోని పవన్ తాజాగా ఒక ట్వీట్ చేశారు.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారని.. కానీ జగన్ రెడ్డి చేసే మేలు ఉల్లి కూడా చేయదన్నారు.

 అందుకు ఉల్లి ఎందుకంటూ దాని రేటు పెంచేశారని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఉల్లి ధరలు భారీగా పెరగటానికి జగన్ ప్రభుత్వానికి లింకేమీ లేదు. ఆ మాటకు వస్తే.. ధరలు భారీగా పెరిగిన వేళ.. ప్రజలు ఇబ్బంది పడకుండా సబ్సిడీ రేట్లకే ఉల్లి మార్కెట్లు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తున్న వేళ.. ఆ విషయాల్ని పట్టించుకోకుండా జనసేనాని చేసే ట్వీట్లతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న సత్యాన్ని పవన్ మాష్టారు ఎప్పటికి గ్రహిస్తారో?

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Tags:    

Similar News