భాజపాకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

Update: 2016-04-30 11:03 GMT
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరం లేదు అని హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాడు. భారతీయ జనతా పార్టీకి వార్నింగ్ తరహాలో ట్విట్టర్లో ఆయన ఓ ప్రకటన చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తే.. ఇప్పుడు భాజపా కూడా అదే తరహాలో వారి నమ్మకం మీద కొడుతోందన్న తరహాలో పవన్ వ్యాఖ్యానించాడు. స్పెషల్ స్టేటస్ మీద అధికార పార్టీ ఎంపీలు.. ప్రతిపక్షాల్ని కూడా కలుపుకుని పోరాటం చేయాలని పవన్ పిలుపునిచ్చాడు. ఇంతకీ పవన్ చేసిన ట్వీట్లు ఏంటంటే..

‘‘సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం సీమాంధ్ర ఎంపీలను తన్ని.. పార్లమెంటులోంచి బయటికి గెంటి.. ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి.. కాంగ్రెస్ పార్టీ ఒక ఘోరమైన తప్పు చేసింది. ఆరోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మరిచిపోలేదు.. మరిచిపోరు కూడా’’

‘‘ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి.. సీమాంధ్ర ప్రజల నమ్మకం మీద కొట్టి ‘బీజేపీ’ కూడా అలాంటి తప్పు వైపే అడుగులు వెయ్యకూడదని కోరుకుంటున్నాను’’

‘‘ప్రత్యేక హోదా గురించి ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఉద్యమించే లోపే అధికార పార్టీ ఎంపీలు.. ప్రతిపక్షాలను కూడా కలుపుకుని పార్లమెంటులో దీని మీద పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరఫున నా విన్నపం’’
Tags:    

Similar News