ఆ జిల్లా పేరు మార్చాల్సిందే...పవన్ కళ్యాణ్ మరో డిమాండ్ !

Update: 2021-10-22 09:33 GMT
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. కర్నూలు జిల్లా పేరు మార్చాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఇవాళ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇప్పటి వరకూ అంతటి మహనీయుని పేరు ఒక్క ప్రభుత్వ పథకానికీ పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరు మార్చకపోతే, అధికార మార్పిడి తర్వాత ఆ పని జనసేన పార్టీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

తమ పార్టీ ప్రయాణం, ఆశ‌యాల వెనుక కొంద‌రు స్ఫూర్తిప్రధాత‌లు ఉన్నార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పుకొచ్చారు. దామోదరం సంజీవయ్య తో పాటు వారిలో బూర్గుల రామ‌కృష్ణా‌రావు మరొక‌ర‌ని వపన్ తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ స‌మ‌యంలో తెలుగు వారంద‌రూ ఒక్కటిగా ఉండాల‌ని చెప్పార‌ని పవన్ గుర్తు చేశారు. ఆ క్రమంలో ఆయ‌న ముఖ్యమంత్రి ప‌ద‌విని సైతం వ‌దులుకున్నార‌ని పవన్ అన్నారు. అటువంటి మ‌హానుభావులే జనసేన పార్టీకి స్ఫూర్తిప్రధాత‌ల‌ని పవన్ చెప్పారు. కడపను వైఎస్ఆర్ కడపగా మార్చినప్పుడు.. అణగారిన వర్గాలకు అండగా నిలబడిన సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టడం సమంజసమే అని ప్రకటనలో పేర్కొంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సంజీవయ్య కేవలం రెండేళ్లు పనిచేసినా.. ఆయన సేవలు వెలకట్టలేనివి. మరువలేనివి. ఆరు లక్షల ఎకరాల ప్రభుత్వం భూమిని పేదలకు పంపిణీ చేశారు. ప్రతి జిల్లాలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేశారు. వృద్ధాప్య పింఛన్ పథకానికి ఆద్యుడు. వెనకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచి వారికి అండగా నిలబడ్డారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికపక్షపతిగా ముద్రవేసుకున్నారు..' అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అంతటి మహనీయుడిని ఎవరు పట్టించుకోలేదని.. సంజీవయ్య పేరును ఏ పథకానికి పెట్టలేదని పవన్ అన్నారు. సంజీవయ్య గొప్పతనం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో స్మారక భవనం నిర్మించాలని  నిర్ణయించినట్లు చెప్పారు. మేధావులతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Tags:    

Similar News