ఒక్కరంటే ఒక్కరి పన్ను బాకీ వింటే షాకే

Update: 2017-01-24 17:06 GMT
అచ్చు తప్పు ఎంత మాత్రం కాదు. విన్నంతనే ఉలిక్కిపడే విషయాన్ని ఆదాయపన్ను శాఖ తాజాగా వెల్లడించింది. చిన్న చిన్న మొత్తాలు ప్రభుత్వాలకు బాకీ పడితే నానా యాగీ చేసే ప్రభుత్వ సంస్థలు.. కొందరి విషయంలో ఎంత విశాలంగా హృదయంతో వ్యవహరిస్తాయోవింటే నోట మాట రాదంతే. ఐటీ విభాగానికి ఒక్కరంటే ఒక్క వ్యక్తే ఏకంగా రూ.21,870 కోట్ల పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని వెల్లడించింది.

ఇంతకీ ఆ అపర కుబేరుడు ఎవరు? అన్న వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. ఇతగాడి బాకీ ఏకంగా దేశం మొత్తం పన్ను చెల్లింపుదారులు చెల్లింపులో పదకొండు శాతం ఉండటం గమనార్హం. ఇదే తీరులో మరికొందరు కూడా పన్ను బాకీ పడినట్లుగా చెప్పుకొచ్చింది.

రెండేళ్ల కిందట అంటే..2014-15 మధ్య కాలంలో ముగ్గురు పన్ను చెల్లింపుదారుల ఆదాయాలు రూ.500 కోట్లకు పైనే ఉన్నాయని పేర్కొంది. అయితే.. వారి వివరాల్ని కూడా వెల్లడించలేదు. ఇటీవల ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసిన సంచలన రిపోర్ట్ లో.. ఒక శాతానికి పైగా భారతీయుల చేతుల్లోనే 58 శాతం భారతీయుల సంపద ఉందన్న విషయాన్ని పేర్కొనటం తెలిసిందే.

ఈ కొద్ది మంది దగ్గర ఉన్న సంపద.. దేశంలోని 70 శాతం మంది వద్ద ఉన్న సంపదకు సమానంగా పేర్కొంది. ఇదెంత నిజమన్న విషయం ఐటీ శాఖ విడుదల చేసిన పన్ను బకాయిల లెక్కల్ని చూస్తే.. ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు. మరి.. ఇంత భారీగా ఆదాయపన్ను బాకీలు పడుతుంటే.. ఆ విబాగపు అధికారులు బాకీల్ని వసూలు చేయకుండా ఏం చేస్తున్నట్లు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News