డ్రోన్‌ను కూల్చివేసిన ఎన్‌ఎస్‌జీ..అందులో 5 కిలోల పేలుడు పదార్థాలు !

Update: 2021-07-23 11:30 GMT
ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు ఉగ్రదాడి జరిగే ప్రమాదముందన్న నిఘావర్గాల హెచ్చరికతో భద్రతా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. జమ్మూకశ్మీర్‌ లో భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇతే తరహాలో పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో ఈ సారి ఢిల్లీపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాల నుంచి అందిన సమాచారంతో భద్రతా బలగాలు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి.

దీనితో జమ్మూకశ్మీర్‌ లోని అఖ్నూర్‌ ప్రాంతంలో ఓ డ్రోన్‌ ను పోలీసులు కూల్చివేశారు. డ్రోన్‌ నుంచి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రోన్‌ నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ డ్రోన్‌ లో 5 కిలోల బరువున్న అధునాతన పేలుడు పదార్థాలను గుర్తించారు. డ్రోన్‌ కార్యకలాపాల వెనుకు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు భద్రతా బలగాలు. అయితే జమ్మూ లేదా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో డ్రోన్‌ కనిపించడం ఇదేమి మొదటిసారి కాదు.  జులై 16న జమ్మూ ఏయిర్‌ బేస్‌లో సంచరిస్తున్న ఓ డ్రోన్‌ను రాడార్లు, యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ గుర్తించాయి. దీంతో భద్రతా దళాలు దాన్ని నేల కూల్చాయి.

డోన్‌ లతో దాడులకు పాల్పడే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ తన సిబ్బందికి జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్బార్‌ సింగ్‌ సూచించారు. కాగా, భారత ప్రభుత్వం 2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేకహోదా కల్పిస్తున్న అధికరణం 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు నగరంలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని భద్రతా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
Tags:    

Similar News