అమెరికాలో మంచి ఉద్యోగం.. 30ఏళ్లకే నిజామాబాద్‌ యువకుడి మృతి

Update: 2021-10-19 07:05 GMT
నిజామాబాద్ నగరానికి చెందిన యువ సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ అమెరికాలో గుండెపోటుతో మృతి చెందాడు. నగరంలోని మారుతీ నగర్‌ కు చెందిన సుధాకర్ నాయక్ బీసీ వెల్పేర్ ఆఫీసర్‌ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఒక్కగానొక్క కుమారుడు సాయి సుశాంత్ ఉన్నారు. నిజామాబాద్‌ లో బీటెక్ పూర్తిచేసిన సుశాంత్.. అనంతరం ఆమెరికాకు వెళ్లి ఎంఎస్‌ చదివారు. మిచిగాన్ రాష్ట్రంలో పవర్ ఇండస్ట్రీస్‌ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ గా ఉద్యోగం సాధించి అక్కడే స్థిరపడ్డారు.

ఈ నెల 12వ తేదీన ఇంట్లో ఉండగానే సుశాంత్‌ కు గుండెపోటు వచ్చింది. స్నేహితులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. సుశాంత్‌ ను పరీక్షించిన డాక్టర్లు ఆయన చాలాసేపటి క్రితమే చనిపోయారని నిర్ధారించారు. దీంతో అమెరికా అధికారులు నిజామాబాద్‌ లోని సుశాంత్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఒక్కగానొక్క సంతానం కావడంతో సుశాంత్ మరణాన్ని అతడి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాయి సుశాంత్ మృతదేహం మంగళవారం నిజామాబాద్‌ కు రానున్నట్టు బంధువులు తెలిపారు.


Tags:    

Similar News