కొంటారా? పరారీలోని శ్రీమంతుడి లగ్జరీ కార్లు వేలానికి!

Update: 2019-04-26 01:30 GMT
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ సూత్రధారి - పాత్రధారి నీరవ్ మోదీకి సంబంధించిన లగ్జరీ కార్లు వేలానికి వచ్చాయి. పదమూడు వేల కోట్ల రూపాయల మొత్తం అప్పులను తీసుకుని నీరవ్ మోడీ పీఎన్బీకి టోపీ పెట్టిపోగా.. ఇప్పుడు అతడి నుంచి కనీసం చిల్లర మొత్తాలను అయినా వసూలు చేసుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయాస పడుతూ ఉన్నాయి.

అందులో భాగంగా అతడి ఖరీదైన కార్లను వేలానికి ఉంచారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నీరవ్ మోదీ కార్ల వేలం ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ మేరకు కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ పొందిన ఆ సంస్థ అందుకు సంబంధించిన వెబ్ సైట్లో డీలెయిల్స్ ను ఉంచింది.

నీరవ్ మోడీ  కార్లలో వేటిని వేలానికి పెట్టింది, వాటి వేలం లో ప్రభుత్వం వారి పాట ఎంత.. అనే అంశాలను ఈడీ పేర్కొంది. మొత్తం పదమూడు కార్లను వేలానికి ఉంచినట్టుగా ఈడీ పేర్కొంది. వీటిల్లో రోల్స్ రాయిస్ - మెర్సిడేజ్ బెంజ్ - టయోటా ఫార్చూనర్ - ఇన్నోవా - బ్రియో.. తదితర కార్లు ఉన్నాయట. వీటిల్లో కొన్ని మాత్రమే లగ్జరీ కార్లు. మిగతావి పెద్దవేమీ కావని వాటి పేర్లను బట్టే చెప్పేయవచ్చు. ఒకటీ రెండు  కార్లు మాత్రం ఐదారు కోట్ల రూపాయల విలువ చేసేవిలా ఉన్నాయి.

అయితే వేలంలో వాటి ప్రారంభ ధర కేవలం కోటి రూపాయల నుంచినే ఉంది. ఎంతైనా సెకెండ్  హ్యాండ్ కాబట్టి ధర తగ్గిపోయే అవకాశాలున్నాయి. అన్ని కార్లనూ అమ్మినా ఈడీ పదికోట్ల రూపాయలు  అయినా సమీకరించగలదా?అనేది ప్రశ్నార్థకమే.

ఈ కేసులో విచారణకు అయిన ఖర్చు  మొత్తాలను  కూడా ఇలాంటి వేలం పాటల ద్వారా సంపాదించలేరని మాత్రం కచ్చితంగాచెప్పవచ్చు. ఇది వరకూ నీరవ్ మోదీ పెయింటింగ్ కలెక్షన్స్ లను వేలానికి ఉంచగా యాభై కోట్ల రూపాయల వరకూ వచ్చాయట.  పదమూడు వేల కోట్ల రూపాయల స్కామ్ విషయంలో అది కూడా చిల్లరే అని చెప్పవచ్చు!
Tags:    

Similar News