ట్వీట్ చేసి మరీ తిట్టించుకుంది

Update: 2017-02-22 09:06 GMT
తిట్టే నోరు.. తిరిగే కాలు ఊరికే ఉండదని సామెత చెబుతుంటారు. వక్రబుద్ధితో చూస్తే.. కదిలించుకొని మరీ తిట్టించుకునే అలవాటు ప్రముఖ కాలమిస్ట్ శోభాడేకు ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది. అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవటం.. వివాదాస్పదంగా వ్యవహరించటం.. సంబంధం లేని అంశాల్ని కలబోసి అడ్డంగా బుక్ కావటం ఆమెకో అలవాటు. రచయిత్రిగా.. కాలమిస్ట్ గా మేధావి ట్యాగ్ ఉన్న ఆమె.. ఈ మధ్యన అర్థం కాని రీతిలో వ్యవహరిస్తూ వార్తల్లోకి వస్తున్నారు.

తాజాగా ఒక విషయాన్ని కెలికి మరీ మహారాష్ట్ర పోలీసులకు మంట పుట్టించమే కాదు.. సోషల్ మీడియాలో పలువురి చేత ఆక్షింతలు వేయించుకున్న ఘనత ఆమెకు సొంతం చేసుకున్నారు. మంగళవారం ముంబయిలో బీఎంసీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన ఆమె.. తాను ఓటు వేసిన విషయాన్ని చెప్పుకున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని చేసే ప్రతి పనిని నలుగురికి చెప్పుకోవటం ఒక అలవాటుగా మారిన నేపథ్యంలో.. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.

అయితే.. కథ ఎక్కడఅడ్డం తిరిగిందంటే.. ఎన్నికల సందర్భంగా ‘‘భారీ బందోబస్తు’’ అంటూ భారీకాయంతో ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ కుర్చీలో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న ఫోటోను పెట్టారు. దీంతో.. అమ్మడి మీద అందరూ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎందుకు ఆమెను తప్పు పట్టారంటే.. ఆ పోలీసు మహారాష్ట్ర పోలీస్ కాదని.. మధ్యప్రదేశ్ పోలీసుగా తేల్చారు. శోభాడే పెట్టిన ట్వీట్ మీద ముంబయి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు.

ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆమె నుంచి ఇలాంటివి వినాల్సి రావటం బాధాకరమని పేర్కొంటూ.. శోభాడే ఎటకారాన్ని తాము ఇష్టంగా ఓకే చేస్తాం కానీ.. ఆ ఫోటోలో ఉన్నది తమకేమాత్రం సంబంధించి పోలీసు అధికారి అంటూ పేర్కొన్నారు. ఒకరిని ఎటకారం చేయాలనుకున్నప్పుడు.. పది మంది ముందు మనం ఎటకారం కాకూడదన్న జాగ్రత్త శోభాడే ఎందుకు తీసుకోవటం లేదు..?

ఇంతకుముందు రియో ఒలింపిక్సు సమయంలో మన ఆటగాళ్లకు ఖర్చు చేయడం వేస్టని ఆమె కామెంట్ చేయడం దుమారం రేపింది. ఇప్పుడు ఈ కామెంట్ కూడా ఆమె పట్ల జీనం తీవ్రంగా ఆగ్రహించడానికి కారణమైంది.  

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News