ముద్రగడ మొదలుపెట్టారు

Update: 2016-02-05 06:31 GMT
కాపులను బీసీలో చేర్చాలన్న డిమాండుతో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు నేత ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష ప్రారంభమైంది. ముద్రగడ తో పాటు ఆయన భార్య కూడా దీక్షలో కూర్చున్నారు.  గత ఆదివారం కాపు గర్జన సభ నిర్వహించడం... అది హింసాత్మక సంఘటనలకు దారితీయడంతో ముద్రగడ దీక్షను ఆపాలని ప్రభుత్వం ఆయనతో చర్చలు జరిపినా కూడా ఫలితం లేకపోయింది. దీంతో ముద్రగడ శుక్రవారం ఉదయం సతీసమేతంగా దీక్షకు దిగారు. వేలాదిగా ఆయన అభిమానులు దీక్ష స్థలానికి చేరుకుంటున్నారు. పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించి ఆయన ఇంటివైపు ఎవరినీ వెళ్లనివ్వకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

కిర్లంపూడిలో పోలీసు ముద్రగడ దీక్ష సందర్భంగా మొన్నటి లాంటి పొరపాటు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. బలగాలు భారీగా మోహరించాయి. కిర్లంపూడితో పాటు పరిసర గ్రామాల్లో 2వేల మంది ఆర్‌ ఏఎఫ్‌ - సీఆర్పీఎఫ్‌ పోలీసులు ఉన్నారు.  ముద్రగడ దీక్ష వద్దకు ఇతరులెవరు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు.

దీక్షకు ముందు ముద్రగడ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించే వరకు దీక్ష చేపడతానని స్పష్టం చేశారు. ఒంటరిగానైనా దీక్ష చేస్తానని తెలిపారు. డిమాండ్లను నెరవేర్చే వరకు దీక్ష కొనసాగిస్తానని పేర్కొన్నారు. దీంతో ముద్రగడ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం అనుక్షణం గమనిస్తూ పరిస్తితి అదుపు తప్పకుండా అప్రమత్తంగా ఉంటున్నారు.
Tags:    

Similar News