జగన్ బెయిల్ రద్దుపై కీలక పరిణామం.. కోర్టు ఏం చెప్పింది?

Update: 2021-04-22 10:30 GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిఫెన్సులో పడే సీన్ రాష్ట్ర విపక్షాలకు లేదన్న విషయం ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. ఆయనపై విమర్శలు సంధించే ప్రయత్నం చేయటం.. అది కాస్తా రివర్సు కావటం ఈ మధ్యన ఎక్కువైంది. దీనికి తోడు.. వైసీపీ నేతల దూకుడు కూడా మామూలుగా ఉండటం లేదు. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో పార్టీ గెలుపుతో ఆ పార్టీ నేతల ఆత్మవిశ్వాసం పీక్స్ కు చేరుకుంది. ఇలాంటివేళ.. ఊహించని విధంగా సొంత పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ సరికొత్త వాదనతో అధినేతను ఇరుకున పడేసే ప్రయత్నం చేయటం తెలిసిందే.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం.. దానిపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ పై పదకొండు చార్జ్ షీట్ లను సిబీఐ నమోదు చేయటం.. అందరికి స్పూర్తిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి క్లీన్ చిట్ గా ఉండేందుకే తాను ప్రయత్నం చేస్తున్నట్లుగా రఘురామ వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా రఘురామ పిటీషన్ పై వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నారాయణరావు వాదనలు వినిపించారు. అయితే.. పిటిషన్ కు ఉన్న అర్హత.. అసలీ పిటీషన్ ను విచారించాలా? వద్దా? అన్న దానిపై ఈ నెల 27న సీబీఐ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించనుంది. దీంతో.. ఈ నెల 27న కోర్టు ఏరీతిలో స్పందించనుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామం కీలకంగా మారటమే కాదు.. ప్రత్యర్థి పార్టీ నేతల కంటే సొంత పార్టీ నేతే ఎక్కువగా టెన్షన్ పెట్టిస్తున్నారని చెప్పాలి.
Tags:    

Similar News