బ్రేకింగ్: 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ

Update: 2020-10-20 10:30 GMT
చాలా రోజులు తర్వాత ప్రధాని మోడీ మళ్లీ దేశ ప్రజల ముందుకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. "ఈ సాయంత్రం 6 గంటలకు నా తోటి పౌరులతో ఒక సందేశాన్ని పంచుకుంటాను" అని పిఎం మోడీ ట్వీట్ చేశారు. మోడీ ప్రసంగం ఏమిటనేది స్పష్టంగా తెలియకపోగా, కోవిడ్ -19 కేసుల సంఖ్య తగ్గడం మరియు కోవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీ కోసం భారతదేశం ప్రణాళిక గురించి ప్రధాని మాట్లాడబోతున్నారని సమాచారం.

కరోనా వైరస్ వ్యాపించిన తొలి నాళ్లలో తరుచుగా మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించి పలు సలహాలు సూచనలు దేశ ప్రజలకు చేశారు. ఆ తర్వాత కేసులు తగ్గకపోగా పెరగడంతో ఇక మీడియా ముందుకు రాలేదు.

తాజాగా మోడీ వ్యాక్సిన్ గురించి.. అది దేశ ప్రజలకు ఎలా పంపిణీ చేయాలి? ఎవరికి ముందు వేయాలి? అనేదానిపై దిశానిర్ధేశం చేస్తారని తెలుస్తోంది. అలాగే దేశ ప్రజలకు డిజిటల్ హెల్త్ ఐడి కార్డును తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. రెండు లేదా మూడు మోతాదుల వ్యాక్సిన్ ను దేశ ప్రజలకు ఇవ్వవచ్చని.. దేశ ప్రజలందరికీ వేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక ఆరోగ్య ఐడితో రాబోతోందని సమాచారం.

కోవిడ్ -19 వ్యాక్సిన్ ను భారత ఫార్మా కంపెనీలు శరవేగంగా తయారు చేస్తున్నాయి. ప్రముఖ ఫార్మా కంపెనీల అనేక టీకాలు వివిధ దశలలో ఉన్నాయి. వాటిలో కొన్ని చివరి దశలో ఉన్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకుని టీకా పంపిణీ కోసం ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే మోడీ దిశానిర్ధేశం చేయబోతున్నట్టు సమాచారం.

కరోనా వైరస్‌పై కీలక ప్రకటన ఏదైనా వెలువడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ తయారీపైనా ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Tags:    

Similar News