దారికి తెచ్చుకునేందుకే అనర్హత అస్త్రమా ?

Update: 2022-06-26 09:30 GMT
మహారాష్ట్రలో తిరుగుబాటు ఎంఎల్ఏలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఇంతకీ ఆ అస్త్రం ఏమిటంటే అనర్హత వేటు అస్త్రమే. తిరుగుబాటు నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో సుమారు 38 మంది శివసేన ఎంఎల్ఏలు తిరుగుబాటు చేయటం పెద్ద సంచలనంగా మారింది. అయితే షిండే  శిబిరంలోని ఎంఎల్ఏలందరు ఇష్టపూర్వకంగానే తిరుగుబాటు నేతతో చేతులు కలిపారా ? లేకపోతే వీళ్ళని మాయ చేసి షిండే తన శిబిరంలో ఉంచుకున్నారా అన్నది తెలీదు.

సరే విషయం ఏదైనా షిండే వర్గంలోని 16 మంది ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేసేందుకు డిప్యుటీ స్పీకర్, యాక్టింగ్ స్పీకర్ నరహరి సీతారాం నోటీసులు పంపారు. నోటీసులకు సోమవారం సాయంత్రంలోగా సమాధానం చెప్పాల్సిందని స్పష్టంగా చెప్పారు. షిండే వర్గంలో అంతమంది ఎంఎల్ఏలుంటే కేవలం 16 మందికి మాత్రమే ఎందుకని నోటీసులు పంపినట్లు ? ఎందుకంటే అనర్హత వేటు నోటీసులిచ్చి అందరినీ దారికి తెచ్చుకోవటమే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్లాన్ గా తెలుస్తోంది.

నోటీసులిచ్చిన వారిలో కూడా అందరిమీదా లేకపోతే ముందుగా ఓ ఇద్దరు ముగ్గురిపై అనర్హత వేటు వేస్తే మిగిలిన వారు ఎక్కడున్నా తన దగ్గరకు పరిగెత్తుకొని వస్తారని థాక్రే వ్యూహం. ఎలుకలను పట్టుకోవాలంటే బొరియల్లో పొగపెట్టినట్లు షిండే తిరుగుబాటు శిబిరంలో ఉన్న ఎంఎల్ఏలందరినీ బయటకు లేదా తన దగ్గరకు రప్పించుకోవాలంటే అనర్హత వేటు వేయటం ఒకటే మార్గంగా  థాక్రే గట్టిగానే డిసైడ్ అయినట్లున్నారు.

తన ప్లానులో భాగంగా ఇప్పుడు 16 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఒకవేళ వీళ్ళల్లో ఎవరిపైన అనర్హత వేటు వేసినా ఎవరు ఏమీ చేయగలిగేదిలేదు. వీళ్ళు కోర్టుకు వెళ్ళినా చెల్లదు. అనర్హత వేటు వేయటంలో స్పీకర్ చట్టాన్ని ఫాలో అయ్యారా లేదా అన్నది మాత్రమే కోర్టు చూస్తుంది. చట్ట ప్రకారమే నోటీసులిచ్చి వీళ్ళపై అనర్హత వేటు వేస్తే ఏ కోర్టూ చేయగలిగింది ఏమీ లేదు. ఇదంతా చూసుకునే 16 మందికి అనర్హత వేటు నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. చూడాలి చివరకు ఏమవుతుందో.
Tags:    

Similar News