జగన్ సామ్రాజ్యంపై ఫోకస్ పెట్టిన నారా పుత్రుడు

Update: 2015-10-05 03:39 GMT
అభివృద్ధి విషయంలో తండ్రి చంద్రబాబు రూటే వేరు. అరచేతిలో స్వర్గం చూపించి ప్రజల ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టిన బాబు అథికారం చేపట్టిన తర్వాత ప్రజల ముఖం చూడకుండా, ప్రజలకు ముఖం చూపకుండా సింగపూర్ - జపాన్ యాత్రలలో మునిగితేలుతున్నారు. చెప్పిన మాటకు కట్టుబడటం తన చరిత్రలోనే లేదని అడుగడుగునా రుజువు చేసుకుంటున్న చంద్రబాబుకు తగ్గ తనయుడిగా లోకేష్ ముందుకొస్తున్నారు.

నాయనేమో రాష్ట్రంలోని అన్ని జిల్లాలను స్వర్గంలో ముంచెత్తాలని కంకణం కట్టుకుని విదేశాలకు పరుగులు తీస్తున్నాడు. కొడుకేమో కడపను పైకి లేపుతానని తాజాగా శపథాలు చేస్తున్నాడు. తెలుగుదేశం పాలన ఇలాగే కొనసాగితే రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చెలరేగటం ఖాయమని సంకేతాలు వెలువడుతుంటే ప్రస్తుతానికి సీమ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని ముందుకొస్తున్నారు లోకే్ష్.

దీంట్లో భాగంగా వైఎస్ జగన్ కంచుకోట కడపలో పాగా వేయాలని, ఆ జిల్లాలో ఉక్కుప్యాక్టరీని ఏం చేసైనా సరే నెలకొల్పాలని లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు భోగట్టా. వైఎస్ హయాంలో 10వేల ఎకరాల భూమి కేటాయించి ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని చేసిన ప్రయత్నం కార్యరూపం దాల్చిని నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలతోనే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలన్నది లోకేష్ యోచన.

నిజంగా లోకేష్‌కు చిత్తశుద్ధి ఉండి ఉక్కుఫ్యాక్టరీని తీసుకొస్తే కడప జిల్లా ముఖచిత్రమే మారిపోతుంది. కాని తండ్రి నిర్వాకం చూసిన తర్వాత తనయుడి మాటల్ని ఎంతవరకు ప్రజలు నమ్ముతారు అనేదే సందేహం. ఆకాశహర్మ్యాల బాబు.. ఉక్కు ప్యాక్టరీల తనయుడు.. రాష్ట్రంలో మరో తమాషాకు రంగం సిద్ధమవుతోందా?
Tags:    

Similar News