మోడీ మాట తర్వాత పులిహోర విశ్లేషకులు ఏమంటారో?

Update: 2020-04-14 17:30 GMT
అంచనాలు తప్పాయి. గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హోరెత్తి పోయిన లాక్ డౌన్ 2.0 మీద అంచనాలన్ని పులిహోరగా మారిపోయాయి. కరోనా కట్టడి చేసేందుకు భారత్ దగ్గర లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదన్న విషయం మీద ఫుల్ క్లారిటీ వచ్చేసిన తర్వాత.. లాక్ డౌన్ తాళాలు తీసే ధైర్యం ఎవరు మాత్రం చేయగలరు. ప్రపంచం ఇప్పటివరకూ ఎప్పుడూ చూడనటువంటి ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న వేళ.. అన్ని మూసుకొని కూర్చోవటం మినహా మరో మార్గం లేదన్న వైనం మరోసారి నిరూపితమైంది.

ఇరవై ఒక్క రోజుల లాక్ డౌన్ గడువు దగ్గర పడుతున్న వేళ.. చాలామంది చాలానే విశ్లేషణలు చేశారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో తీవ్రత తక్కువగా ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మొత్తంగా పది వేల పాజిటివ్ కేసులకు దగ్గరగా వచ్చిన దేశంలో.. లాక్ డౌన్ ను పాక్షికంగా ఎత్తి వేస్తారని కొందరు. అలా కాకుండా కొన్ని నిబంధనల్ని సడలించే అవకాశం ఉందని ఇంకొందరు.. జిల్లాల వారీగా ఆంక్షల్ని అమలు చేసే వీలుందని మరికొందరు.. ఎవరికి వారు వారికి తోచిన రీతిలో విశ్లేషణలు చేశారు.

అవన్నీ ఉత్త మాటలే అన్న విషయం తాజాగా తేలిపోయింది. జాతి ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే సమయంలో.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భిన్నంగా మే 3 వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఏప్రిల్ 30 వరకూ లాక్ డౌన్ విధించిన రాష్ట్రాల్లోనూ మే మూడు వరకూ పొడిగించినట్లైంది. మోడీ ప్రకటనకు ముందు వరకూ ఎవరికి వారు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తూ.. లాక్ డౌన్ ఇలా ఉంటుంది? అలా ఉంటుందన్న సందేశాల్ని వైరల్ చేస్తూ ప్రచారం చేశారు. మోడీ చెప్పిన తాజా మాటతో అవన్ని పులిహోర కబుర్లుగా తేలిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేత.. ఆంక్షల సడలింపు లాంటివి సాధ్యం కాదన్న వైనాన్ని ప్రధానమంత్రి తన సందేశం తో స్పష్టం చేశారని చెప్పాలి. ఇకనైనా విశ్లేషకులు తమ పులిహోర విశ్లేషణల్ని ఆపేస్తే మంచిది.
Tags:    

Similar News