విషాదంః చిన్న లాజిక్ మిస్సైన వైద్య‌ దంప‌తులు!

Update: 2021-07-03 08:05 GMT
ఈ ప్ర‌పంచంలో బాధ లేని మ‌నిషి ఉంటాడా? స‌మ‌స్య ఎదురుకాని ప్రాణి ఉంటుందా? ఈ విష‌యం తెలియ‌నివాళ్లు ఎవ‌రూ ఉండ‌రు. కానీ.. దాన్ని అర్థం చేసుకునేవారు మాత్రం కొంద‌రే. అందుకే.. నిత్యం బాధ‌తో కుమిలిపోయేవారు కొంద‌రైతే.. ఆ తీవ్ర‌త ఎక్కువైన‌ప్పుడు ప్రాణాలు తీసుకునేవాళ్లు మ‌రికొంద‌రు. తాజాగా ఓ జంట ఇదే దారుణానికి పాల్ప‌డిన వైనం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వాళ్లిద్ద‌రూ మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అన్న‌ట్టుగా ఉన్నారు. అంతేకాదు.. ఇద్ద‌రూ వైద్యులు. స‌మాజంలో గౌర‌వ‌ప్ర‌ద‌మైన వృత్తిలో జీవిస్తున్నారు. మ‌రి, స‌మ‌స్య ఎక్క‌డ వ‌చ్చింద‌నేది తెలియ‌దు. కానీ.. వీరి బంధాన్ని మాత్రం వేగంగా తొలిచేస్తూ వ‌చ్చింది. చివ‌ర‌కు ఇద్ద‌రి ప్రాణాల‌ను బ‌లిగొంది. ఈ దారుణ సంఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని పుణెలో చోటు చేసుకుంది.

వారి పేర్లు నిఖిల్ - అంకిత‌. పెళ్లి జ‌రిగిన కొన్నాళ్ల త‌ర్వాత నుంచే వీరిమ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. ముందు రోజు రాత్రి గొడ‌వ పెట్టుకున్న దంప‌తులు.. ఈ నెల ఒక‌టో తేదీన డ్యూటీకి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత భార్య అంకిత నిఖిల్ కు ఫోన్ చేయ‌డం.. ఇద్ద‌రూ ఫోన్లోనే గొడ‌వ ప‌డ‌డం జ‌రిగిపోయాయి. చిరాకులో కాల్‌ మ‌ధ్య‌లోనే క‌ట్ చేశాడు నిఖిల్‌.

సాయంత్రం ఇంటికి వ‌చ్చి చూస్తే.. ఊహించ‌ని ఘ‌ట‌న‌. ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని క‌నిపించింది భార్య‌. ఏ మాత్రం ఊహించ‌ని ఈ దారుణాన్ని చూసి భీతిల్లిపోయాడు నిఖిల్‌. ఈ ఘ‌ట‌న‌కు త‌న‌ను బాధ్యున్ని చేస్తార‌ని అనుకున్నాడో..? ఆమె లేకుండా ఉండలేకపోయాడో తెలియదుగానీ.. పక్క గదిలోకి వెళ్లి, తాను కూడా బలవతంగా ప్రాణం తీసుకున్నాడు.

ఉదయం ఇంట్లో పని చేసేందుకు పని మనిషి రాగా.. తలుపులు తీయలేదు. పిలిచినా స్పందన లేదు. దీంతో.. పక్కవారిని పిలిచి పరిశీలించగా.. ఈ ఘోరం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి, వివరాలు సేకరించారు.

డాక్టర్ చదివారంటే.. సమాజంపై ఖచ్చితంగా ఓ మోస్తరు అవగాహన అయినా ఉంటుంది. ఇద్ద‌రూ డాక్ట‌ర్లే కాబ‌ట్టి ఇంకా మెచ‌ర్యూరిటీతో ఆలోచించే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ త‌మ ఇద్ద‌రికీ సెట్ కాద‌ని అనుకున్న‌ప్పుడు విడిపోయి.. ఎవ‌రి జీవితం వాళ్లు చూసుకుంటే అయిపోతుంది. ఈ చిన్న లాజిక్ ఆలోచించ‌కుండా.. చావు మాత్ర‌మే త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం అని భావించ‌డ‌మే అత్యంత విషాదం.




Tags:    

Similar News