మార్చి 8న మ‌హిళా ఎంపీలే మాట్లాడాలి

Update: 2016-03-03 09:21 GMT
జేఎన్‌యూ.. హెచ్‌సీయూ.. దుర్గాదేవి.. ఇలా ఎన్నో అంశాల‌పై అధికార‌.. విప‌క్ష నేత‌లు హాట్ హాట్ గా ప్ర‌సంగాలు చేస్తున్న వేళ‌.. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపేందుకు ప్ర‌ధాని మోడీ లోక్‌స‌భ‌లో ప్ర‌సంగించారు. నిన్న‌టికి నిన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. న‌ల్ల‌ధ‌నాన్ని తెల్ల‌ధ‌నంగా మార్చేందుకు మోడీ ఫెయిర్ అండ్ ల‌వ్లీ ప‌థ‌కాన్ని షురూ చేసిన‌ట్లుగా వ్యంగ్య వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. మోడీ స‌ర్కారు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

విప‌క్ష నేత‌లు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్న వేళ‌.. వీరంద‌రికి స‌మాధానంగా మోడీ ఏం మాట్లాడ‌తారు? ఆయ‌న ఏ విధంగా బ‌దులిస్తార‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో త‌న ప్ర‌సంగాన్నిషురూ చేసిన ప్ర‌ధాని మోడీ త‌న మార్క్ ప్ర‌ద‌ర్శించారు. స‌భ‌ను అడ్డుకోవ‌టం స‌రికాదంటూ ప‌లు కొటేష‌న్లు కోట్ చేసిన ఆయ‌న‌.. అవ‌న్నీ దివంగ‌త ప్ర‌ధానులు నెహ్రు.. ఇందిరా.. రాజీవ్ గాంధీలుగా ప్ర‌క‌టించి కాంగ్రెస్ కు చుర‌క పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

అంతేనా.. మాజీ లోక్ స‌భ స్పీక‌ర్‌.. క‌మ్యూనిస్ట్ సీనియ‌ర్ నేత సోమ్‌నాథ్ చ‌ట‌ర్జీ కోట్ ల‌ను ప్ర‌స్తావిస్తూ.. వామ‌ప‌క్షాలకు డిఫెన్స్ లో ప‌డే ప్ర‌య‌త్నం చేశారు. ఆత్మ‌న్యూన‌త‌తో ఉండే వారు మాత్ర‌మే స‌భ‌ను అడ్డుకుంటారంటూ వ్యాఖ్య‌లు చేయ‌టం ద్వారా త‌న మైండ్ గేమ్ మాట‌ల రుచి చూపించే ప్ర‌య‌త్నం చేశారు.

ఇలా ఓప‌క్క విప‌క్షాల‌పై తెలివిగా విరుచుకుప‌డుతూనే.. మార్చి 8న మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆ రోజంతా మ‌హిళా ఎంపీలు మాత్ర‌మే మాట్లాడే అవ‌కాశం ఇస్తే బాగుంటుంద‌న్న ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. కొత్త‌గా ఎన్నికై తొలిసారి స‌భ‌కు వ‌చ్చే ఎంపీల‌కు చాలానే ఐడియాలు ఉంటాయ‌ని.. వారి భావాలు వినేందుకు ఒక వారం పాటు వారు మాత్ర‌మే మాట్లాడే అవ‌కాశం ఇస్తే ఎలా ఉంటుంద‌న్న ప్ర‌శ్న‌ను సందించారు. విప‌క్ష నేత‌లు సంధించిన ప్ర‌తి ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చేలా ఆయ‌న త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News