ఏపీ ఎన్నికలపై సర్వే.. లగడపాటి సంచలన నిర్ణయం లేదా

Update: 2019-03-14 05:16 GMT
తెలంగాణ ఎన్నికలు ఆంధ్రా ప్రాంత నేతలకు పీడకలగా మారిపోయాయి. ఎంతో లాబీయింగ్ చేసి.. వందల కోట్లు కుమ్మరించినా ఫలితం వేరేలా రావడంతో చంద్రబాబు సహా డబ్బులు పెట్టిన నేతల ఆశలు ఆవిరయ్యాయనే గుసగుసలు వినిపించాయి. ఇక ముఖ్యంగా ఇన్నాళ్లు సర్వేల పేరుతో సంపాదించుకున్న క్రెడిబులిటీని తాకట్టు పెట్టి మరీ తెలంగాణ ఎన్నికల్లో తప్పుడు సర్వే ఇచ్చిన లగడపాటి పరువు పోగొట్టుకున్నారు. అందుకే ఇప్పుడు ఆ పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్త పడుతున్నాడట..

తాజాగా లగడపాటి నోరు విప్పారట.. ఆంధ్రా ఎన్నికల వేళ ఉత్కంఠ ఊపేస్తున్న తరుణంలో సర్వేను చేసి విడుదల చేయాలని కొన్ని పార్టీలు కోరగా.. దానికి లగడపాటి సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. తెలంగాణ ఎన్నికల్లో ముందే సర్వే చేసి అభాసుపాలు అయ్యానని.. ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లకు తావు ఇవ్వనని స్పష్టం చేశాడట.. ఈసారి ఏప్రిల్ 11న ఎన్నికలు ముగిశాక మాత్రమే ఏపీపై సర్వేను బయటపెడుతానని లగడపాటి ప్రకటించారట..

నిజానికి లగడపాటి ఈసారి టీడీపీ తరుఫున ఎంపీ గా బరిలోకి దిగుతాడని అంతా భావించారు. బాబుతో రెండు మూడు సిట్టింగ్ లు కూడా వేశాడు. కానీ తాజాగా తాను రాజకీయ సన్యాసం కొనసాగిస్తానని పోటీచేయనని స్పష్టం చేశారు. ఒకవేళ టీడీపీ తరుఫున నిలబడితే లగడపాటి సర్వేకు అంత విశ్వసనీయత ఉండేది కాదు. ఎలాగూ టీడీపీ గెలుస్తుందని ఇచ్చేవాడేమో.. ఇప్పుడు ఏపార్టీలో లేడు కాబట్టి మళ్లీ సర్వే ఇచ్చినా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఎన్నికల తర్వాత ఇస్తానని ప్రకటించడంతో ఆ సర్వేపై ఆసక్తి లేకుండా పోయింది.

ఎలాగూ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి ఆ సోదిలో లగడపాటి సర్వేను పట్టించుకోరు.. తెలంగాణలో వలే ఆంధ్రాలో కూడా ఎన్నికలకు ముందే సర్వే చేయాలని అందరూ కోరుతున్నారు. ఈ నరాల తెగే ఉత్కంఠలో లగడపాటి సర్వే మజాను ఇస్తుందని చెబుతున్నారు. కానీ లగడపాటి మాత్రం ఇందుకు సముఖంగా లేరని సమాచారం.
Tags:    

Similar News