పాక్ ఎంపీగా హిందువు..ద‌ళితురాలికి ద‌క్కిన గౌర‌వం

Update: 2018-03-05 08:38 GMT
పొరుగుదేశమైన పాకిస్థాన్‌ లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌ లోని సింధ్ ప్రావిన్స్‌ కు చెందిన కృష్ణకుమారి కొల్హి అనే హిందూ దళిత మహిళ చరిత్ర సృష్టించారు. ముస్లిం మెజారిటీ దేశమైన పాక్ పార్లమెంట్‌ కు ఎన్నికైన మొదటి హిందూ దళిత మహిళగా ఆమె ఘనత సాధించినట్లు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) వెల్ల‌డించింది. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పీపీపీ తరఫున సింధ్ ప్రావిన్స్‌ లోని థార్ స్థానం నుంచి కొల్హి (39) పోటీ చేసి సెనేటర్‌ గా గెలుపొందారని తెలిపింది. సింధ్‌ లోని మైనారిటీ రిజర్వ్ సీటుకుగాను కొల్హికి పీపీపీ టికెట్ ఇచ్చింది. ఆమె ఎన్నిక పాకిస్థాన్‌ లో మహిళలు - మైనారిటీ హక్కులకు లభించిన గౌరవంగా పలువురు అభివర్ణిస్తున్నారు. కాగా, గతంలో రత్నా భగ్వాన్‌ దాస్ చావ్లా అనే హిందూ మహిళను మొదటిసారిగా సెనేటర్‌ గా పీపీపీ ఎన్నుకుంది.

1979 ఫిబ్రవరిలో థార్‌ లోని నాగర్‌ పర్కార్‌ లో రైతు కుటుంబంలో కొల్హి జన్మించారు. కొల్హి 9వ తరగతిలో ఉండగా.. తన 16వ యేట లాల్‌ చంద్‌ తో ఆమెకు వివాహమైంది. పెళ్లి తర్వాత కూడా విద్యను కొనసాగించిన ఆమె.. 2013లో సింధు విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ పూర్తిచేశారు. అనంతరం తన సోదరునితో కలిసి పీపీపీలో సామాజిక కార్యకర్తగా చేరారు. ఆమె సోదరుడు బెరానో యూనియన్ కౌన్సిల్ చైర్మన్‌ గా ఎన్నికయ్యారు. థార్‌ తోపాటు మిగతాప్రాంతాల్లోని అట్టడుగు - అణగారిన - పీడితవర్గాల హక్కుల కోసం కొల్హి అనేక పోరాటాలు చేశారు. 1857లో సింధ్‌లోని నాగర్‌ పర్కార్‌ లో దాడికి యత్నించిన బ్రిటిష్ బలగాలపై పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు రూప్‌ లీ కొల్హి కుంటుంబానికి చెందినవారు కృష్ణకుమారి కొల్హి. 1858 ఆగస్టు 22న రూప్‌ లీ కొల్హిని బ్రిటిష్‌ వారు అరెస్టు చేసి ఉరితీశారు.

కాగా, పాకిస్తాన్‌ లోని 52 మంది సెనేటర్ల పదవీకాలం ఈ నెల ముగియనుండటంతో వారి స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 130 మందికిపైగా ఈ ఎన్నికల్లో పోటీచేశారు. ఈ ఎన్నిక‌ల్లో హిందూ మ‌హిళ కొల్హి  గెలుపొందారు.
Tags:    

Similar News