వార్​ వన్​సైడ్​.. కేకేఆర్​పై ఆర్​సీబీ సునాయాస విజయం!

Update: 2020-10-22 04:30 GMT
మంగళవారం రాత్రి కోల్​కతా నైట్​ రైడర్స్​ కు బహుశా నిద్రపట్టలేదేమో..  అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్​ 2020లో ఆ జట్టు బ్యాట్స్​మన్ దారుణంగా విఫలమయ్యారు. 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన కోల్​కతా జట్టు కేవలం 84 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్లో ఇదే అత్యల్ప స్కోర్​.. ఈ లక్ష్యాన్ని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. 13.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి  85 పరుగులు చేసి ఈజీగా గెలుపొందారు.

సిరాజ్‌ చెలరేగాడు
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్​కతా నైట్​రైడర్స్​  ఆది నుంచి తడబడుతూ వచ్చింది. ఇన్నింగ్స్​ ఆరంభంలోనే మహ్మద్​ సిరాజ్​ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి కోల్‌కతాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. రెండో ఓవర్‌ మూడో బంతికి ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (1) ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి బాల్​కు అప్పుడే క్రీజులోకి వచ్చిన నితీశ్‌ రాణా (0) బౌల్డ్‌ అయ్యాడు. నవదీప్‌ సైనీ వేసిన మూడో ఓవర్‌లో మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ ‌(1) కూడా ఔటయ్యాడు.

దీంతో మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ కష్టాల్లో పడింది. సిరాజ్‌ వేసిన నాలుగో ఓవర్‌ లో టామ్‌ బాంటన్ ‌(10) కూడా కీపర్‌ డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇయాన్‌ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌ ఐదు ఓవర్ల పాటు మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. కానీ స్కోర్ ​బోర్డు మాత్రం కదలేదు. తొమ్మిదో ఓవర్ నాలుగో బంతికి కార్తీక్ (4)ఔట్ అయ్యాడు. కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ (34 బంతుల్లో 30) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. చివరలో కుల్దీప్‌ యాదవ్‌ (12), ఫర్గుసన్ ‌(19 నాటౌట్‌) పరుగులు చేయడం తో కోల్‌కతా 84 పరుగులు చేసింది. సిరాజ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు.


సునాయాసంగా ఛేదన

తర్వాత బ్యాటింగ్​ కు వచ్చిన కోహ్లీసే సునాయాసంగా 85 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో పూర్తి చేసింది. అది కూడా కేవలం రెండు వికెట్లు కోల్పోయి. అరోన్‌ ఫించ్‌ (16), దేవదత్‌ పడిక్కల్‌ (25), గుర్‌కీరత్‌ సింగ్ మాన్ (21), విరాట్ కోహ్లీ (18) తలో చేయి వేశారు. ఇదే పిచ్‌పై బెంగళూరు బౌలర్లు చెలరేగితే.. కోల్‌కతా బౌలర్లు మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫర్గుసన్ ఒక వికెట్ తీశాడు. ఈ సీజన్‌లో తొలిసారి మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షంగా ముగిసింది. ఈ విజయంతో కోహ్లీసేన పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. బెంగళూరు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి.

పడిక్కల్ మెరుపులు..

స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగళూరుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. దేవదత్‌ పడిక్కల్ ‌(25: 17 బంతుల్లో 3ఫోర్లు)‌ ధాటిగా ఆడగా.. ఆరోన్‌ ఫించ్‌ (16; 21 బంతుల్లో, 2×4) ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరి మెరుపులతో పవర్‌ప్లే చివరికి బెంగళూరు 44/0తో నిలిచింది. ఈ జంట తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. అయితే ఫెర్గూసన్‌ వేసిన 7వ ఓవర్‌లో వీరిద్దరూ  పెవిలియన్‌కు చేరారు. రెండో బంతికి ఫించ్ .. వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. నాలుగో బంతికి పడిక్కల్‌ అనూహ్యంగా రనౌటయ్యాడు. సమన్వయ లోపంతో పడిక్కల్‌ పెవిలియన్ చేరాడు.
 
ముగించిన కోహ్లీ

ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (18*; 17 బంతుల్లో, 2×4) మరో బ్యాట్స్‌మన్‌ గుర్‌కీరత్‌ సింగ్ మాన్ (21; 26 బంతుల్లో, 4×4)‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కోల్‌కతా బౌలర్లలో ఫర్గుసన్‌ ఒక వికెట్‌ తీశాడు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ.. తర్వాత గేర్‌ మార్చి బౌండరీలు బాదారు. దీంతో బెంగళూరు 13.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో కోహ్లీసేన మరోసారి అదరగొట్టింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్‌ కు మరింత చేరువైంది. ఈ సీజన్‌ లో 10వ మ్యాచ్ ఆడిన బెంగళూరుకి ఇది ఏడో గెలుపు.
Tags:    

Similar News