చంద్రబాబు బాటలో కేరళ సీఎం.. మోడీకి షాక్

Update: 2020-11-05 09:10 GMT
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబును వసుదేవుడితో పోలుస్తుంటారు. అవసరార్థం ఎవరికాళ్లైనా పట్టుకొని చంద్రబాబు పనికానిచ్చుకుంటారు అని రాజకీయవర్గాల్లో ఓ ప్రచారం ఉంది. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకుంటారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. అలాంటి చంద్రబాబు పోయిన ఎన్నికల వేళ కాంగ్రెస్ తో జట్టుకట్టి మోడీని ఓడించడానికి ఎక్కని విమానం లేదు.. తొక్కని గడపలేదంటారు. కానీ బ్యాడ్ లాక్ చంద్రబాబు ఓడి మోడీ రికార్డ్ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు మోడీకి వంతపాడుతూ కాంగ్రెస్ ను కాలదన్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి.  చంద్రబాబు అంత కాదు కానీ.. కేరళ సీఎం కూడా ఓ విషయంలో అలానే ప్రవర్తిస్తున్నారు. తన మెడకు చుట్టుకునేసరికి చంద్రబాబు బాటలో నడిచేశాడు.

వామపక్ష భావజాలంతో ఉప్పొంగిపోయే కేరళ సీఎం విజయన్ కు మోడీ అన్నా.. హిందుత్వ బీజేపీ అన్న అస్సలు పడదు. ఆయన సెక్యులర్ వాది.  ఇప్పుడు ఆ వామపక్ష సర్కార్‌‌ కాస్త బీజేపీతో దోస్తీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.

గతంలో ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో సీబీఐ రాకను అడ్డుకున్నారు. రాష్ట్రంలో అడుగు పెట్టేది లేదంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా.. కేరళ ప్రభుత్వం కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ ప్రవేశాల అనుమతిని నిరాకరించింది.

కేంద్ర ప్రభుత్వం సీబీఐని అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రేరేపిత దాడులకు దిగుతోందంటూ గతంలో చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు కాస్త దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాష్ట్రంలోకి అనుమతించకుండా నిషేధించి సంచలనం సృష్టించారు. ఆ త‌ర్వాత చంద్రబాబును ఆద‌ర్శంగా తీసుకున్న ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ కూడా త‌మ రాష్ట్రంలోకి సీబీఐ రాక‌ను అడ్డుకున్నారు. అనంత‌రం ఛ‌త్తీస్‌గ‌డ్‌, ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకున్నాయి.

ఇక ఇప్పుడు కేరళ ప్రభుత్వం కూడా వారి బాటలో నడిచింది.ఇటీవ‌ల కేర‌ళ రాష్ట్రాన్ని కుదిపేసిన బంగారు ర‌వాణా విష‌య‌మై కూడా ముఖ్యమంత్రి త‌న అభిప్రాయాన్ని వెల్లడించారు. బంగారు అక్రమ ర‌వాణా కేసు ప్రాథ‌మిక ద‌ర్యాప్తు స‌రైన మార్గంలోనే సాగింద‌ని, ఆ త‌ర్వాత ప‌క్కదారి ప‌ట్టింద‌ని అభిప్రాయపడ్డారు. కావాల‌ని ప్రభుత్వ పెద్దల్ని ఇరికించాల‌నే కుట్రలు చేశారని, వాటిని ప‌సిగ‌ట్టిన‌ట్టు చెప్పారు. అందుకే.. తమ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

 ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి..కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం ఆల్రెడీ సీబీఐ ద‌ర్యాప్తులో ఉన్న వాటికి వ‌ర్తించ‌ద‌ని సీఎం స్పష్టం చేశారు. భ‌విష్యత్తులో చేప‌ట్టే కేసుల‌కు మాత్రమే వ‌ర్తిస్తుంద‌ని చెప్పారు. అయితే.. ఇందుకు గల కారణాలను కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు.

‘మా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను కించపరిచేలా కొన్ని కేంద్ర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఇది మా ప్రభుత్వానికి అవమానపరిచేదిగా భావిస్తున్నాం. ఇలాంటి చర్యలకు మా ప్రభుత్వం అనుమతించదు’ అని అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వ కే ఫోన్‌, ఈ-మొబిలిటీ హ‌బ్‌, స్మార్ట్ సిటీ, డౌన్‌టౌన్ వంటి నాలుగు ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాల్సిందిగా చీఫ్ సెక్రట‌రీని ఈడీ ఆదేశించింది. ఈ ఏజెన్సీలు కొన్ని ప్రత్యేక ఎజెండాతో ప‌ని చేస్తున్నాయి. వారి ఎత్తుగ‌డ‌లు స‌మాఖ్య రాజ్యాంగానికి విరుద్ధం’ అని విజ‌య‌న్ చెప్పుకొచ్చారు. అందుకే సీబీఐ సహా ఈడీలను కేరళలో నిషేధిస్తున్నట్టు విజయన్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News