ఓటుకునోటు.. కేసీఆర్ హెచ్చ‌రికతో కొత్త క‌ద‌లిక‌

Update: 2018-12-12 15:18 GMT
తెలుగు రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాకుండా, దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన  కుదిపేసిన ఓటుకునోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ భవన్ లో నేడు టీ.ఆర్.ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఓటుకునోటు పైనా రియాక్ట‌య్యారు. విపక్ష నేతలను ఉద్దేశించి కేసీఆర్ స్పందిస్తూ ఈ టర్మ్‌లో మాత్రం ఎవరినీ వదిలి పెట్టం, ఓటుకు నోటు కేసు ప్రాసెస్‌ లోనే ఉంది అని సంచ‌ల‌న హింట్ ఇచ్చారు.

కాగా, కొద్దికాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రగతిభవన్‌లో పోలీసు అధికారులతో  సమావేశమ‌య్యారు. ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డితోపాటు ఏసీబీ డీజీ కూడా హాజరయ్యారు. ఈ కేసును గతంలో డీల్ చేసిన ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్ కూడా హాజర‌య్యారు. ఈ భేటీలో భాగంగా ఓటుకు నోటు కేసు పురోగతిని కేసీఆర్‌ అడిగి తెలుసుకోవ‌డంతో పాటుగా ఇటీవల వచ్చిన ఫోరెన్సిక్‌ నివేదిక పై చర్చించినట్టు సమాచారం. కాగా, ఈ భేటీకి ముందు గవర్నర్‌తో సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్‌.. మ‌రుస‌టిరోజు పోలీసు అధికారులతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యి.. విచారణ జరుగుతున్న ఏసీబీ కేసుల పురోగతిని సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఇందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన రికార్డ్ అయిన వాయిస్ పై ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమని వచ్చింది. నివేదిక ఏం చెబుతుంది అనే వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ పై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై నాయ్యనిపుణుల సూచనలు, సలహాలు కూడా తీసుకున్నారు.

కాగా, తాజాగా తెలంగాణ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌చారం, త‌న‌ పై విమ‌ర్శ‌లు చేసిన తీరు, కాంగ్రెస్ పార్టీతో జ‌ట్టుక‌ట్టిన విధానం దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ ఏపీ రాజ‌కీయాల్లోనూ వేలు పెడ‌తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనికి తోడుగా తాను ఏపీలో కూడా ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పారు. తాజాగా ఓటుకునోటు ప్రాసెస్‌ లో ఉంద‌ని చెప్ప‌డం ద్వారా ఈ ప్ర‌క్రియ‌ను దూకుడుగా ముందుకు తీసుకుపోవ‌డం ఖాయ‌మ‌ని విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News