అజ్ఞాతంలోకి వెళ్లిన జోగు రాము ఫోన్ కు కనెక్ట్ అయ్యాడు

Update: 2019-09-11 05:24 GMT
మొన్నటి వరకూ పార్టీ పదవిలో ఉంటూ చక్రం తిప్పిన కేటీఆర్.. ఇప్పుడు పార్టీ.. ప్రభుత్వ పదవితో దూసుకెళ్తున్నారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో పార్టీలోని పలువురునేతలు గుర్రుగా ఉన్నారంటూ వస్తున్న వార్తలతో మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయినట్లుగా చెబుతున్నారు. పదవులు దక్కలేదన్న బాధతో ఉన్నారంటూ మీడియాలో వచ్చిన నేతలపై టీఆర్ ఎస్ అధినాయకత్వం దృష్టి పెట్టింది. ఒక్కో నేతను బుజ్జగించటమే కాదు.. వారికి దక్కాల్సిన ప్రాధాన్యత దక్కుతుందన్న భరోసాను ఇవ్వటం మొదలెట్టారు.

ఎవరికి అందుబాటులోకి లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న జోగురామన్నను లైన్లోకి తెచ్చేందుకు మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. అంత పెద్ద కేటీఆర్ ఫోన్ పట్టుకున్నాక.. జోగి రామన్న లాంటోళ్లు సీన్లోకి రాకుండా ఉంటారా?  దీనికి తగ్గట్లే పార్టీ అధినేత మీద అలకతో ఎవరికి అందుబాటులోకి లేకుండా తన దారిన తాము వెళ్లిపోయారు పలువురు టీఆర్ ఎస్ నేతలు. అలాంటి వారి కోపాన్ని తగ్గించటంతో పాటు.. వారిని బుజ్జగించటానికి ప్రత్యేక టీం రంగంలోకి రాగా.. ఎంతకూ కొరుకుడుపడని కొందరు నేతల విషయాన్ని తాను చూసుకుంటానన్న కేటీఆర్.. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు.

అలకబూని అజ్ఞాతంలోకి వెళ్లిన జోగు రామన్నకు ఫోన్ చేసిన కేటీఆర్.. ఆయన్ను బుజ్జగించటంతో పాటు.. భవిష్యత్తు పట్ల భరోసాను ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి హామీ ఇవ్వటంతో.. జోగు రామన్న కాస్త మెత్తబడ్డట్లుగా చెబుతున్నారు. కేటీఆర్ లాంటోడు రంగంలోకి దిగితే.. జోరు రామన్న లాంటోళ్లు ఫోన్లు ఎందుకు కలవవు చెప్పండి?
Tags:    

Similar News