ఐటీలో క‌ల‌వ‌రం..ఇన్ఫీ పెద్దాయ‌న రాజీనామా

Update: 2017-06-18 08:15 GMT
అంత‌ర్జాతీయంగా ఐటీ రంగంలో నెల‌కొన్న గ‌డ్డుప‌రిస్థితులు ఇన్నాళ్లు మ‌ధ్య‌ - ఎగువ స్థాయి ఉద్యోగులపై ప‌డి పెద్ద ఎత్తున‌ కొలువులు ఊడ‌బీకడం అనే ఆందోళ‌నక‌ర ప‌రిణామం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ముప్పు మ‌రింత విస్తృతం అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. పేలవమైన త్రైమాసిక ఫలితాల కారణంగా ఇన్ఫోసిస్ కంపెనీ అగ్ర కార్యనిర్వాహకులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ అధ్యక్షుడు  - అమెరికాస్ అధిపతి సందీప్ దద్లానీ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన 2001 నుంచి ఇన్ఫోసిస్‌ లో పనిచేస్తున్నారు. దాని ఉత్పత్తులు - రిటైల్ - కన్జూమర్ అండ్ ప్యాకేజ్డ్ గూడ్స్(సిపిజి) - లాజిస్టిక్స్ వెర్టికల్‌ లకు ఆయన ప్రపంచ అధినేతగా కూడా పనిచేస్తున్నారు. ఆయన తన రాజీనామా గురించి లింక్డ్‌యిన్‌ లో పోస్ట్ చేశారు. ఆయన తదుపరి వర్జీనియాకు చెందిన కన్ఫెక్షనరీ అండ్ పెట్ ఫుడ్ కంపెనీలో చేరనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని దద్లానీ ఇంకా నిర్దారించలేదు.

పెరిగిన ఒత్తిడి కారణంగానే దద్లానీ ఇన్ఫోసిస్ కంపెనీని నుంచి తప్పుకుని ఉంటారని అమెరికాలోని ఐటి అడ్వయిజరీ ఎవరెస్ట్ గ్రూప్ సిఇవో పీటర్ బెన్‌డోర్-శా మ్యూల్ అభిప్రాయపడ్డారు. దద్లానీ నిష్క్రమణ ఇన్ఫోసిస్ స్థిరత్వం సమస్యను లేవనెత్తుతోందని బ్రోకరేజ్ సంస్థ ఎడల్వయిజ్ పేర్కొంది. దద్లానీ బాధ్యతలు కర్మేశ్ వాస్వానీ, నితేశ్ బంగాకు పంచబడతాయని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇదిలా ఉండగా ఇన్ఫోసిస్ గ్లోబల్ సేల్స్ హెడ్‌గా మోహిత్ జోషిని నియమించే అవకాశాలున్నాయని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా ఐటీలోని ప‌రిణామాలు పెద్ద స్థాయిలోని వారికి ఎస‌రు పెట్టేలాగా ఉండ‌టం ప‌రిశ్ర‌మ‌లోని ప‌రిస్థితులకు అద్దంప‌డుతోంద‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News