యుద్ధంలో దేనికైనా సిద్ధం అంటున్న పాకిస్తాన్

Update: 2015-08-31 05:18 GMT
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం.. సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు జరపటం మొదలుకొని.. అక్రమంగా తీవ్రవాదుల్ని భారత్ లోకి పంపిణీ చేసే పాకిస్తాన్ తాజాగా రణ నినాదం చేస్తోంది. యుద్ధం గురించి మాట్లాడుతుంది. భారత్ కానీ తమపై యుద్ధానికి దిగితే దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నమంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది.

పాకిస్థాన్ రక్షణ మంత్రి మహమ్మద్ ఆసిఫ్ తాజా మాటలు చూస్తే.. పాక్ బాధ్యతారాహిత్యం ఇట్టే కనిపిస్తుంది. భారత్ తమపై యుద్ధానికి దిగితే.. దాన్ని ఎదుర్కోవటం సిద్ధంగా ఉన్నామని.. తమపై యుద్ధానికి కాలు దువ్వితే.. భారత్ భారీ మూల్యం చెల్లించుకోవటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. భారత్ తమ పై దాడి చేస్తే.. దాని నుంచి భారత్ కోలుకోవటానికి దశాబ్దాల పాటు పడుతుందని చెబుతున్నాడు.

తమ మాతృభూమి కోసం పాక్ బలగాలు ఏం కావాలంటే అది చేస్తామని చెప్పిన ఆయన మాటల మర్మం అర్థం కానిదేమీ కాదు. ఓ పక్క నిబంధనల్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతూనే.. మరోపక్క ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చూస్తుంటే.. భారత్ ఏదైనా చర్యలకు పాల్పడుతుందన్న భయం పాక్ కు ఉన్న విషయం అర్థమవుతుంది. ఏదిఏమైనా భయంతో కానీ.. బెదిరింపు ధోరణితో కానీ పాక్ చేస్తున్న వ్యాఖ్యల్ని భారత్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News