పన్ను ఎగ‌వేత‌లో...హైద‌రాబాదీలే టాప్‌

Update: 2017-11-17 08:00 GMT
తెలుగు రాష్ర్టాల ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌రో ప్ర‌త్యేక రికార్డ్‌ ను సాధించింది. అయితే ఇది పాజిటివ్ రికార్డ్ అనుకునేరు. కాదు ప‌రువుపోయే రికార్డ్‌. అవును మ‌రి. ఆదాయం పన్ను ఎగవేతదారుల సంఖ్య విషయంలో మన హైదరాబాద్‌ నగరం అగ్రస్థానాన్ని సంపాదించింది. దేశవ్యాప్తంగా 96 మంది ఎగవేతదారులుండగా - వారిలో 25 మంది నగరానికి చెందిన వారేనని ఆదాయం పన్ను శాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. హైదరాబాద్‌ తర్వాత అహ్మదాబాద్‌ 20 మందితో రెండో స్థానంలో ఉంది. అయితే పన్ను ఎగవేతదారులు ఎక్కువగా ఉన్నప్పటికీ ముంబయ్‌ - నవీ ముంబయ్‌ లలోనే ఎక్కువ మొత్తాలు బకాయిపడ్డాయి.

దేశవ్యాప్తంగా ఉన్న ఎగవేతదారులు 1980 నుంచి మొత్తం రూ. 3,614 కోట్లు పన్ను బకాయి పడినట్టు పేర్కొంటూ వ్య‌క్తులు లేదా ఈ రకంగా పన్ను ఎగవేతకు పాల్పడినకంపెనీల నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయడం సాధ్యం కాదని కూడా ఓ అధికారి తెలిపారు. ఇలా ప‌న్ను ఎగ‌వేసిన వారిలో చాలా కేసుల్లో దోషుల ఆచూకీని అధికారులు గుర్తించలేకపోయారు. మరి కొన్ని కేసులలో దోషులు దివాళా ప్రకటించేశారు. ముంబయ్‌ కి చెందిన ఉదయ్‌ ఆచార్య (ఇప్పుడు జీవించిలేడు) రూ. 779 కోట్లు పన్ను చెల్లించాల్సిఉంది. కానీ ఆయన దివాళా తీసినట్టుగా గతంలోనే ప్రకటించుకున్నాడు. నోటీసులు - రిమైండర్లు ఇవ్వటంతో పాటు పన్ను మదింపుదారుకు అనేక అవకాశాలు ఇచ్చి చివరిగా అధికారులు స్వయంగా వెళ్లి వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇవేవీ ఫలించని సందర్భాలలో వారిని ఎగవేతదారుల జాబితాలో చేరుస్తారు. ఈ ఎగవేతదారుల జాబితాలో 69 మంది ఆచూకి లేకుండా పోగా, 24 మంది దివాళా ప్రకటించుకున్నారు.
Tags:    

Similar News