సీఎం జగన్ సొంత జిల్లా కడపకు భారీగా పెట్టుబడులు

Update: 2020-10-27 05:30 GMT
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపకు పెట్టుబడులు పోటెత్తాయి. తాజాగా సీఎం జగన్ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యూఫ్యాక్చరింగ్ క్లస్టర్ పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని.. వీలైనంత త్వరగా నిర్మాణ కంపెనీ ఎంపిక పూర్తి చేయాలని సూచించారు.

కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యూఫ్యాక్చరింగ్ క్లస్టర్ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేయాలని జగన్ సూచించారు. కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్ ప్లాంట్ ను తీసుకొస్తున్నామని.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలన్నారు.

ప్రస్తుతం కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి  7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని.. వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి సంస్థను ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ 3-4 వారాల్లోనే ప్రారంభిస్తామని తెలిపారు.

కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఎలక్ట్రానిక్ మాన్యూఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని.. 300 కోట్ల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్ కంపెనీ ముందుకొచ్చిందని అధికారులు తెలిపారు.  దాదాపు 30వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం కావాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
Tags:    

Similar News