గోరంట్ల వెటకారం.. తీసేసిన తహసీల్దార్లు!

Update: 2016-10-25 10:27 GMT
ఏమాటకామాట చెప్పుకోవాలి కానీ మన రాజకీయ నాయకులకు వెటకారం కాస్త ఎక్కువే!! వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో వారికి వారే సాటి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో తాజాగా వైకాపా నేత బొత్స సత్యనారాయణపై వ్యంగ్యాస్త్రాలు విసిరే పనికి పూనుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే గోర్లంట బుచ్చయ్య. కేవలం వెటకారమే కాదు చిన్నపాటి జోష్యం కూడా చెప్పే ప్రయత్నం చేశారు.

విజయనగరం జిల్లా రాజకీయాలతో పాటు కాపు సామాజిక వర్గంలోను బలమైన నేతగా ఎదిగిన బొత్స సత్యనారాయణ... నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్ లోనే కొనసాగి అనంతరం వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న బొత్స సత్యనారాయణ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో పార్టీ తరుపున తనకున్న అనుభవంతో ముందుంటున్నారు. అధికార పార్టీకి కౌంటర్ ఎటాక్ లతో పార్టీ తరుపున గట్టిగా సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బొత్సను నిలువరించడానికి అన్నట్లు టీడీపీ కొత్త ప్రయత్నం ప్రారంభించింది. ఈ క్రమంలో బొత్స కొత్తపార్టీ పెడుతున్నారని కామెంట్ చేసింది.

ప్రస్తుతం ఈ కామెంట్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ ఆసక్తికర వార్త ఏంటంటే.. "బొత్స కొత్త పార్టీ" పెడుతున్నారు అనేది. అలా అని ఇదేదో సీరియస్ విషయమనో - లేక బొత్స చెప్పేసిన సంగతనో అనుకునేరు... టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య - బొత్స సత్యనారాయణపై వదిలిన వ్యంగ్యాస్త్రం. బొత్సను ఎద్దేవా చేస్తూ మాట్లాడిన గోరంట్ల... రాష్ట్రంలో త్వరలో కొత్త పార్టీ రాబోతుంది, ఆ పార్టీ పేరు "తీసేసిన తహసీల్దార్లు" అని అన్నారట. బొత్సతో పాటు మరికొందరు సీనియర్ నాయకులు జగన్ ను నమ్ముకుని వైసీపీలోకి వెళ్లారని, ఇప్పుడది సాధ్యం కాకపోవడంతో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారట గోరంట్ల. ఇది అసలు విషయం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News