ఆయ‌న‌కు ఎందుకో అటువైపు గాలి మ‌ళ్లింది..

Update: 2017-04-29 08:09 GMT
మైనింగ్ మ‌హారాజా గాలి జనార్దన్ రెడ్డి త‌న‌పై ఎంత ఫోక‌స్ ఉన్నా కూడా త‌న హెవీరేంజిని ప్ర‌ద‌ర్శించుకోవ‌డంలో  ఏమాత్రం వెనుకాడ‌రు.  గతేడాది నోట్ల రద్దు సమయంలోను వందల కోట్ల రూపాయల ఖర్చుతో కుమార్తె పెళ్లిని వైభవంగా జరిపించి గాలి జనార్దన్ రెడ్డి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు  పులి పిల్లలు - ఒక ఏనుగు పిల్లను దత్తత తీసుకుని మ‌రోసారి వార్త‌ల‌కెక్కారు. బెంగళూరు సమీపంలో ఉన్న బన్నేరుఘట్ట జంతు ప్రదర్శనశాలలో ఈ జంతువులు ఉన్నాయి. ఈ జూను సందర్శించిన ఆయన ఆడపులి పిల్లలకు అరుణ్య, శాంభవి అని... మగపులి పిల్లకు శివ అని పేరు పెట్టారు. ఏనుగు పిల్లకు తనకు ఆప్త మిత్రుడైన ఎంపీ శ్రీరాములు పేరు పెట్టారు.

కాగా వీటి పోషణకు గాను జూ అధికారులకు రూ. 4.75 లక్షలు చెల్లించారు. అంతేకాదు, ప్రతి ఏటా జంతువులను దత్తత తీసుకుంటానని ఆయన తెలిపారు.  ఇందులో ఒక్క ఏనుగుకే  1.75లక్షలు చెల్లించగా, పులి పిల్లలకు తలో రూ.1లక్ష ఖర్చు చేయనున్నారు. సంవత్సరం వరకు వాటికి అయ్యే ఖర్చులను గాలి జనార్థన్ రెడ్డి భరించనున్నారు. వీటితో పాటు ప్రతీ ఏటా మరిన్ని జంతువులను దత్తత తీసుకుంటానని గాలి జనార్థన్ రెడ్డి ప్రకటించారు.

ప్ర‌ముఖులు జూలో జంతువుల‌న ద‌త్త‌త తీసుకోవ‌డం కొత్తేమీ కాదు,  అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, ఎంఎస్ ధోని, జహీర్ ఖాన్ వంటి క్రికెటర్లు మైసూరు 'జూ'లోని కొన్ని జంతువులను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు గాలి జనార్ద‌న‌రెడ్డి కూడా ఒకేసారి నాలుగు జంతువుల‌ను ద‌త్త‌త తీసుకోవ‌డ‌మే కాకుండా ఇక‌పైనా తీసుకుంటాన‌ని ప్ర‌కటించ‌డం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News