''గడప గడపల''.. చుక్కలు చూపిస్తున్న ప్రజలు.. జారుకున్న చైతన్య

Update: 2022-05-22 09:45 GMT
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ అప్పుడే అన్ని పార్టీలు ప్రజలను చుట్టేస్తున్నాయి. అధికార వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట ప్రజల ముందుకు వెళ్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేని చోట అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, వాటి వల్ల ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధిని వివరిస్తున్నారు. ఎంత మేర లబ్ధి పొందారో తెలుపుతూ ఒక కరపత్రాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా మరోసారి తమను గెలిపించి ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అందించిన లేఖను ప్రతి కుటుంబానికి అందిస్తున్నారు.

అయితే.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు, నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. వివిధ సమస్యలపై ఎక్కడకక్కడ గట్టిగా నిలదీస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందడం లేదని.. మురుగు సమస్య ఉందని.. తాగునీరు లభించడం లేదని.. స్మశానానికి దారి లేదని ఇలా రకరకాల సమస్యలపై ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వ్యతిరేకతను అస్సలు ఊహించని వైఎస్సార్‌సీపీ నేతలు బిత్తరపోతున్నారు. తమపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఉండటం చూసి తట్టుకోలేకపోతున్నారు.

ప్రతి రోజూ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన తప్పడం లేదు. తాజాగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ బాచిన కృష్ణ చైతన్యకు ఇదే పరిస్థితి ఎదురైంది. కుందుర్రులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ చైతన్యను పలువురు సమస్యలపై నిలదీశారు. వీవోఏగా పనిచేస్తున్న తనకు ఎప్పటి నుంచో జీతం రావడం లేదని ఓ ముస్లిం మహిళ ప్రశ్నించారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు ఇచ్చినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతం అడుగుతున్నందుకు తనపై టీడీపీ కార్యకర్తననే ముద్ర వేశారని ఆమె వాపోయారు. దీంతో ముస్లిం మహిళ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక కృష్ణచైతన్య అక్కడ నుంచి జారుకున్నారు.

ఈ నిరసనలను ముందుగానే ఊహించే రాష్ట్ర ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి గడప గడపకూ వైఎస్సార్‌సీపీ అనే పేరును మార్చి గడపకు గడపకూ మన ప్రభుత్వం అని పెట్టింది. తద్వారా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే పార్టీపై పడకుండా చర్యలు చేపట్టింది. అయినా కార్యక్రమం పేరు మార్చినప్పటికీ వైఎస్సార్‌సీపీ నేతల నుంచి ప్రజలకు నిరసనలు తప్పడం లేదు.
Tags:    

Similar News