లేటెస్ట్: మరింత విషమంగా జైట్లీ ఆరోగ్యం

Update: 2019-08-24 06:03 GMT
వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు చొప్పున బీజేపీ అగ్ర నేతల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి ఆసుపత్రులకు చేరటం ఈ మధ్యన ఎక్కువైంది. ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యానికి గురి కావటం.. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ ఎయిమ్స్ లో చేరటం తెలిసిందే.

కొద్ది రోజులుగా ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. రాష్ట్రపతి కోవింద్ మొదలుకొని బీజేపీకి చెందిన అత్యున్నత స్థాయి నేతలంతా ఎయిమ్స్ కు క్యూ కట్టటం తెలిసిందే. ఆయన కోలుకోవాలని.. విషమ పరిస్థితి నుంచి బయటపడాలన్న ప్రార్థనలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. ఆగస్టు 9న ఆయన శ్వాస తీసుకోవటంలో సమస్య ఎదురుకావటంతో ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ దిగజారింది. తాజాగా ఆయన పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గురువారం ఆయనకు డయాలసిస్ చేశారు.

పలువురు బీజేపీ అగ్ర నేతలు ఎయిమ్స్ కు వెళుతూ.. ఆయన్ను పరామర్శిస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉమాభారతి ఎయిమ్స్ కు చేరుకొని జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదన్న మాట వినిపిస్తోంది.



Tags:    

Similar News