ఇండియాలో కాస్ట్లీ నగరం ఏంటో తెలుసా?

Update: 2023-06-08 14:24 GMT
హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ గుర్తింపు అయితే తెచ్చుకుంటోంది. తాజాగా అంతర్జాతీయంగా  ఉన్న ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ సైతం నిలిచింది. మెర్సర్స్‌ 2023 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సర్వే ప్రకారం మన దేశంలో విదేశీయులకు అత్యంత కాస్ట్లీ నగరంగా ముంబయి నిలిచింది.

ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ, చెన్నై, బెంగళూరు, కొల్ కతా, పుణె నగరాలు ఉన్నాయి.  ప్రపంచం మొత్తం మీద కాస్ట్లీ  నగరాల్లో మన దేశంలో ముంబయికి 147వ స్థానం దక్కగా... దిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్‌ 202, కోల్‌కతా 211, పుణె 213వ స్థానాల్లో నిలిచాయి.

ప్రతి నగరంలో వసతి, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, ఎంటర్ టైన్ మెంట్ వంటి 200 వరకు అంశాలకయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని, ఈ జాబితా రూపొందించారు.  ఇక ఆసియా ఖండంలో చూసుకుంటే..  ఖరీదైన అగ్రగామి 35 నగరాల్లో ముంబయి, దిల్లీ నిలిచాయి. ఆసియా నగరాల్లో ముంబయి స్థానం గతేడాదితో పోలిస్తే ఒక స్థానం తగ్గి 27కు చేరింది.

అంతర్జాతీయంగా చూసుకుంటే... హాంగ్ కాంగ్, సింగపూర్, జ్యూరిచ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.  అతి తక్కువ వ్యయాలతో కూడిన పట్టణాలుగా హవానా, కరాచీ, ఇస్లామా బాద్‌ నిలిచాయి. ముంబయితో పోలిస్తే చెన్నై, హైదరాబాద్‌, కోల్‌ కతా, పుణెల్లో వసతి ఖర్చులు 50 శాతం తక్కువగా ఉన్నాయని ఈ సర్వేలో తేలింది. విదేశీ ఉద్యోగులకు కోల్‌ కతాలో అత్యంత తక్కువ వసతి ఖర్చులున్నాయట.

బహుళ జాతి సంస్థలు విదేశాల్లో కార్య కలాపాలు ఏర్పాటు చేసుకోవాలంటే దిల్లీ, ముంబయి వ్యయాల పరంగా అనుకూల మైన వేదికలుగా ఉన్నట్టు మెర్సర్‌ నివేదికలో వివరించింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇక్కడ నివాస వ్యయాలు తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది.

విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించుకోవాలనుకునే బహుళ జాతి కంపెనీలకు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో షాంఘై, బీజింగ్‌, టోక్యోలతో పోలిస్తే ముంబయి 147 వ స్థానంలో ఉండగా, దిల్లీ 169 వ స్థానంలో ఉంది.

Similar News