కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదానేనా?

Update: 2020-03-23 07:20 GMT
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 2వ స్టేజ్ మొదలైంది. కరోనా సోకిన విదేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారికి ఈ కరోనా వ్యాప్తి మొదలైంది. ఇది తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే కరోనా ప్రభావంతో తెలంగాణ, ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పాటించాయి. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశాయి. దీంతో ఈనెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను కూడా సోమవారం ఎన్నికల కమిషన్ వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సీఎంలు, ప్రతిపక్ష నేతలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి. ఏపీలో 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రావాల్సి ఉంటుంది. తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు రావాలి. వీరిలో ఒక్కరికి కరోనా లక్షణాలున్నా అందరికీ వ్యాపించడం ఖాయం. అందుకే ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేయడానికే కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.  

ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) సోమవారం సమావేశమవుతోంది. కరోనా కారణంగా రాజ్యసభ ఎన్నికలు జరపాలా వద్దా అనే విషయంపై చర్చించనున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈసీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయొచ్చని అసెంబ్లీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News