దశలావారీగా తగ్గుతున్న కాంగ్రెస్ బలం!

Update: 2019-05-14 14:30 GMT
సుమారు 130 ఏళ్ల చరిత్ర ఉన్న.. అత్యంత పురాతన పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్‌ పార్టీలో గత 70 ఏళ్లుగా చీలికలు వస్తూనే ఉన్నాయి. ప్రతి ఏటా కాంగ్రెస్‌ బలం తగ్గిపోతోంది. సరైన నాయకత్వం లేకపోవడం.. నెహ్రూ కుటుంబసభ్యులు ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ బలహీన పడుతోంది. ఫలితంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కనుమరుగైంది. అధికారం నుంచి దూరం కావడంతో పాటు ప్రతిపక్షంలో కూడా ఉండలేని పరిస్థితి దాపురించింది.

కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ స్థాపించిన నాయకులు రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ను భూస్థాపితం చేశారని చెప్పవచ్చు. ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలుస్తోంది. ఫలితంగా గత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి చీలి ప్రాంతీయ పార్టీలుగా మారిన వాటికే ఎక్కువ సీట్లు వచ్చాయి.

ఫలితంగా కాంగ్రెస్‌ సంఖ్యాబలం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ 44 స్థానాల్లో విజయం సాధిస్తే.. పశ్చిమబెంగాల్‌ లో టీఎంసీ 34 స్థానాల్లో గెలిచింది. అదేవిధంగా ఏపీ – తెలంగాణలో వైఎస్సార్‌ సీపీ 9 సీట్లలో విజయం సాధించింది.  ఈ సారి కూడా కాంగ్రెస్ నుంచి చీలిక పక్షాలు గట్టిగానే ఎంపీ సీట్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ బలాన్ని ఆ పార్టీలు చీల్చేసి సొంతంగా చక్రం తిప్పేలా ఉన్నాయి. కాంగ్రెస్ పాత్రను దేశ రాజకీయంలో అవి పరిమితం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పార్టీలు చీలిన వైనాలను గమనిస్తే…

– 1951లో జేబీ కృపలానీ కిసాన్‌ మజదూర్‌ ప్రజాపార్టీని స్థాపించారు.

– 1956లో ఇండియన్‌ నేషనల్‌ డెమొక్రటిక్‌ కాంగ్రెస్‌ పార్టీని సి.రాజగోపాలాచారి స్థాపించారు.

– 1959లో సి.రాజగోపాలాచారి - ఎన్‌ జీ రంగా కలిసి స్వతంత్య్ర పార్టీ ఏర్పాటు చేశారు.

– 1964లో కేఎం జార్జి కేరళ కాంగ్రెస్‌ స్థాపించారు.

– 1967లో చరణ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో భారతీయ క్రాంతిదళ ఏర్పాటైంది.

– 1967లో అజయ్‌ ముఖర్జీ నేతృత్వంలో బంగాళ కాంగ్రెస్‌ స్థాపించారు.

– 1969లో బిజు పట్నాయక్‌ ఆధ్వర్యంలో ఉత్కల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేశారు.

– 1969లో ఇందిరాగాంధీ నేతృత్వంతో కాంగ్రెస్‌ (ఐ) స్థాపించారు.

– 1969లో మొరార్జీ దేశాయి - కె.కామరాజ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌(ఒ) ఏర్పాటు చేశారు.

– 1977లో జగజ్జీవన్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఫర్‌ డెమొక్రసీ స్థాపించారు.

– 1979లో దేవరాజు అరసు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ అరసు ఏర్పాటు చేశారు.

– 1980లో ఏకే ఆంటోని కాంగ్రెస్‌(ఎ) స్థాపించారు.

– 1986లో ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రీయ సమాజ్‌ వాదీ కాంగ్రెస్‌ స్థాపించారు.

– 1994లో ఎన్‌ డీ తివారీ - నటవర్‌ సింగ్‌ సంయుక్తంగా ఆల్‌ ఇండియా ఇందిరా కాంగ్రెస్‌ స్థాపించారు.

– 1997లో మమతా బెనర్జీ కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించారు.

– 1999లో శరద్‌ పవార్‌ నేషనలిస్టు సోషలిస్టు పార్టీ ఏర్పాటు చేశారు.

– 1999లో ముఫ్తీ మహమద్‌ సయ్యద్‌ నేతృత్వంలో జమ్ము కశ్మీర్‌ పీడీపీ ఏర్పడింది.

– 2001లో పి.చిదంబరం ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ జననాయకె పెరవై పార్టీ స్థాపించారు.

– 2003లో నైఫురియా నేతృత్వంలో నాగాపీపుల్‌ ఫ్రంట్‌ ఏర్పడింది.

– 2011లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడింది.
Tags:    

Similar News