సీటే రాలేదు.. అప్పుడే పంచేస్తున్నాడు..

Update: 2018-09-21 11:42 GMT
తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడం.. ముందస్తు ఎన్నికలకు తెరదీయడంతో అభ్యర్థులంతా ఇప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఎలాగైనా సరే గెలిచి తీరాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నారు. టికెట్ వస్తుందో రాదోనన్న సంగతి పక్కన పెడితే ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే ఏ పార్టీ నుంచి అయినా గెలిచి తీరవచ్చన్న విశ్వాసం వారిలో కనిపిస్తోంది. అందుకే ముందస్తు ఎన్నికలకు ముందుగానే నేతలంతా ఓటర్లపై బహుమతుల వాన కురిపిస్తున్నారు. వారిని ఆకట్టుకోవడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా మంచిర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్ రావు అప్పుడే ప్రచారం ప్రారంభించేశారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందో లేదో తెలియదు కానీ ఓటర్లను ఆకట్టుకోవడానికి తాయిలాలకు తెరదీశారు.  తాజాగా మంచిర్యాల నియోజకవర్గంలోని మహిళలందరికీ బతుకమ్మ కానుక పేరుతో చీరల పంపిణీ చేస్తున్నారు.  ఇది కేవలం మహిళలపై అభిమానంతోనే ఇస్తున్నామని.. ఆడకూతుళ్లందరూ తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికల కోడ్ వస్తే ఇలా బహిరంగంగా చీరలు - బహుమతులు ఇవ్వడం కుదరదు.. అందుకే కోడ్ రావడానికే ముందే ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తూ ప్రేం సాగర్ రావు ఓటర్లను ఆకట్టుకుంటున్నాడు. ప్రజల్లో తన పాపులారిటీని పెంచుకుంటున్నాడు. ఒకవేళ కాంగ్రెస్ సీటు వస్తే పర్లా.? రాకున్నా కానీ ఏదో పార్టీ తరఫున పోటీచేసి గెలిచేందుకు  ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఇలా బహుమతులు పంపిణీ చేస్తూ దూసుకెళ్తున్నారు.
Tags:    

Similar News