బాబుకు సరికొత్త తలపోటు తెచ్చిన మరో విప్‌

Update: 2015-07-11 10:42 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సరికొత్త తలనొప్పులు మొదలయ్యాయి. గత పదమూడునెలలుగా పార్టీ నేతల కారణంగా ఇబ్బందులు పడని చంద్రబాబు తాజాగా మాత్రం.. ఒకరి తర్వాత ఒకరి కారణంగా కొత్త ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వ విప్‌.. కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చేసిన రచ్చ తెలిసిందే. తన ఇసుక దందాను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోను అడ్డుకోవటంతో పాటు.. తన అనుచరులతో దాడి చేసిన ఘటన కిందామీదా పడి.. ప్రభుత్వ అధికారి చేత విచారణ చేయిస్తానన్న బాబు హామీతో సద్దుమణిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇంకా ఒక సెటిల్‌ కాకముందే.. ఇలాంటి వ్యవహారమే మరొకటి తెరపైకి వచ్చింది.

ఈ వ్యవహారంలోనూ మరో ప్రభుత్వ విప్‌ కారణం కావటం గమనార్హం. శనివారం మధ్యాహ్నం కడపజిల్లా ఒంటిమిట్టలో ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి.. ఆయన అనుచరులు కలిసి ఒంటిమిట్ట పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల వద్దకు ఆయన వెళ్లారు.

ఈ సందర్భంగా పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేదని.. ఆ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. అలా ఒక మహిళా ఉపాధ్యాయురాలు ప్రశ్నించటం మేడా మల్లికార్జునరెడ్డివర్గీయులకు అస్సలు నచ్చలేదు. మా ఎమ్మెల్యేకే సమస్యలు చెబుతావా అంటూ విరుచుకుపడ్డారు. దీంతో షాక్‌ తిన్న ఆమె.. తిన్నగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం మరెంత రచ్చ చేస్తుందో? ఒకరి తర్వాత ఒకరుగా ఈ విప్‌ల తీరుతో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి.

Tags:    

Similar News