విజయవాడ : జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్ !

Update: 2020-08-15 06:50 GMT
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో  ఘనంగా ప్రారంభం అయ్యాయి.  విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ముందుగా ఏపీ సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ  తర్వాత ప్రభుత్వ శాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల్లో సీఎంతో పాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలకు ఏర్పాట్లు చేశారు.  అక్కడికి విచ్చేసిన అథితులు , అధికారులు కూడా భౌతిక దూరం , మాస్కులు వంటి నియమాలని పాటించారు.

74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారతీయులకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.' ఈరోజు మనం ఆనందించే స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చిన వీరులకు నా శతకోటి వందనాలు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలను అర్పించి దేశ భక్తిని మరింత పెంపొందించారు. మన దేశం విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రతిష్టను రక్షించడానికి ప్రతిజ్ఞ చేద్దాం.. దాని పురోగతికి దోహదం చేద్దాం. జై హింద్!' అంటూ ట్వీట్ చేశారు.

ఇక , స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శాసనసభా ప్రాంగణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులు, అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు.  శాసన మండలి ఆవరణలో మండలి చైర్మన్ షరీఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లమ్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు.సచివాలయ ఆవరణలో సీఎస్‌ నీలం సాహ్ని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జీఏడీ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags:    

Similar News