దసరా కానుకగా రాజమహేంద్రవరం..?

Update: 2015-10-10 05:56 GMT
ఆ మధ్య నిర్వహించిన గోదావరి మహా పుష్కరాల ముగింపు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. రాజమండ్రి పట్టణాన్ని గతంలో మాదిరి రాజమహేంద్రవరం అన్న పేరుతో పిలిచేలా చేస్తామన్న మాట చెప్పి అందరిలోనూ భావోద్వేగాన్ని రాజేశారు.

గోదావరి పుష్కరాలు పూర్తి అయి దాదాపు రెండు నెలలు దగ్గరకు వస్తున్నా.. ఆ అంశాన్ని మళ్లీ ప్రస్తావించింది లేదు. తాజాగా..  ఈ అంశంపై చర్చ జరిపి కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరుగుతున్న ఏపీ క్యాబినెట్ లో రాజమండ్రిని.. రాజమహేంద్రవరంగా మార్చే ప్రక్రియకు సంబంధించి అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు.

దసరా కానుకగా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పిలిచేలా అధికారిక నిర్ణయం తీసుకునే వీలుందని చెబుతున్నారు. రాజమండ్రిని పూర్వరంగంలో రాజమహేంద్రిగా వ్యవహరించేవారు. అయితే.. కాలక్రమంలో రాజమహేంద్రవరం కాస్తా.. రాజమండ్రిగా మారిపోయింది. ఇప్పటికి రాజమండ్రి వాసులే కాదు.. తెలుగు ప్రజలు రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పిలిచినంతనే ఇట్టే కనెక్ట్ అయిపోతారు. భావోద్వేగ అంశాల్ని ఈ మధ్య పరిగణలోకి తీసుకుంటున్న చంద్రబాబు.. సమయానికి తగ్గట్లు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా ప్రకటించి గోదావరి జిల్లా వాసుల్ని ఆనందంతో ముంచెత్తాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
Tags:    

Similar News