బాబు గేర్ మార్చారు!.. కెలికితే ఊరుకోర‌ట‌!

Update: 2019-04-02 17:52 GMT
2019 ఎన్నిక‌లు ఇటు టీడీపీతో పాటు అటు వైసీపీకి కూడా అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌లే. అందుకే ఈ రెండు పార్టీలు కూడా త‌మ‌దైన శైలిలో ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే ఎంత‌టి కీల‌క స‌మ‌య‌మైనా కూడా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు క‌ట్టు త‌ప్పి మాట్లాడిన సంద‌ర్భ‌మే లేద‌ని చెప్పాలి. అయితే ఈ ద‌ఫా మాత్రం ఆయ‌న గేర్ మార్చేశారు. త‌న‌ను కెలికితే ఊరుకునేది లేద‌ని ఘీంక‌రిస్తున్నారు. నేటి చంద్ర‌బాబు ప్ర‌చారం చూస్తే... ఇదే మాట వినిపిస్తోంది. విప‌క్షాల‌పై త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు గుప్పించిన చంద్ర‌బాబు నేటి ప్ర‌చారంలో మాట్లాడిన తీరు ఎన్న‌డూ క‌నిపించ‌దు. త‌న సొంత జిల్లా చిత్తూరులో మూడు స‌భ‌ల్లో మాట్లాడిన చంద్ర‌బాబు.... ఇటు విప‌క్షం వైసీపీతో పాటు అటు కేంద్రంలో అధికారంలోని బీజేపీ - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - తెలంగాణ‌లోని అధికార పార్టీ టీఆర్ ఎస్‌ - ఆ పార్టీ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుల‌పై త‌న‌దైన శైలిలో ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కంటే కూడా మోదీ - కేసీఆర్‌ ల‌నే గ‌ట్ట‌గానే టార్గెట్ చేసిన చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేశార‌ని చెప్పాలి.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను ఉద్దేశించి... త‌న‌ను కెలికితే... ఏకంగా తెలంగాణ‌లోని భ‌ద్రాచ‌లాన్ని కూడా ఏపీలోకి లాగేసుకుంటాన‌ని కూడా చంద్ర‌బాబు ఏకంగా ఘాటు వార్నింగే ఇచ్చారు. ఏపీకి జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసీఆర్ ఏకంగా సుప్రీంకోర్టులోనే రెండు పిటిష‌న్లు వేశార‌ని ఆరోపించిన చంద్రబాబు... త‌న‌కు తిక్క రేగితే.. ఇప్ప‌టికే తెలంగాణ నుంచి లాక్కున్న ఏడు మండ‌లాల‌తో పాటుగా భ‌ద్రాచ‌లాన్ని కూడా లాగేసుకుంటాన‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. గ‌తంలో భద్రాచలం ఏపీలోనే ఉండేదన్న విష‌యాన్ని కూడా ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు గుర్తు చేశారు. ఆ త‌ర్వాత మోదీని టార్గెట్ చేసిన చంద్ర‌బాబు... గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీకి నర్మదా బ్యారేజీని కట్టడానికి పదేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. మోదీకి ఏ పనీ చేతకాదని పేర్కొన్న చంద్రబాబు... తల్లిని - భార్యను సరిగ్గా చూసుకోలేని మనిషి అంటూ ఏకంగా వ్య‌క్తిగ‌తంగానూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

చివ‌ర‌గా జ‌గ‌న్‌ పై త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు గుప్పించిన చంద్రబాబు... త‌న‌ను తాను పోలీస్‌గా అభివ‌ర్ణించుకున్నారు. తాను పోలిసునని - తన వద్ద నకరాలు చేస్తే - ఎవ్వర్నీ వదిలి పెట్టనని కూడా చంద్ర‌బాబు కొత్త ప‌ద‌బందాల‌ను వాడేశారు. వై సీపీ డేటా చోరీకి పాల్పడిందని ధ్వజమెత్తిన చంద్రబాబు... ఆ పార్టీ నాయకులు డేటా దొంగల అవతారం ఎత్తారని ఆరోపించారు. డేటా చోరీ వ్యవహారం వెలుగులోకి రాగానే..తాను దొంగలను పట్టుకోవడానికి సిట్ వేశానని చెప్పారు. ఈ దెబ్బ‌కు వారంతా భయపడి పారి పోయారని చంద్ర‌బాబు సెటైరిక్ వ్యాఖ్య‌ల‌ను సంధించారు. ఢిల్లీలో ఉన్న కాపలాదారుడి వద్దకు వెళ్లిన జ‌గ‌న్‌... మోకరిల్లారని చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో కూర్చున్న మోడీ అనే కాపలాదారుడు.. జగన్ ను కాపాడారని చెప్పారు. ఎవ‌రి వ‌ద్ద‌కు వెళ్లి మోక‌రిల్లినా... తాను మాత్రం జ‌గ‌న్‌ను వదిలి పెట్టబోనని హెచ్చరించారు. మొత్తంగా ఎన్నిక‌ల పోలింగ్‌ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ గేర్ మార్చేసిన చంద్రబాబు... వైరి వ‌ర్గాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
Tags:    

Similar News