వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్..?

Update: 2018-04-03 14:30 GMT
బాగా తెలిసిన మీడియాతో మ‌సులుకోవ‌టం పెద్ద ఇబ్బంది కాదు. నిత్యం బీటు చూసే రిపోర్ట‌ర్లు ప్ర‌శ్న‌లు సంధించే అవ‌కావం త‌క్కువ ఉంటుంది. ఒక‌వేళ‌.. ఏదైనా ప్ర‌త్యేక ప‌రిస్థితిలో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించే ప్ర‌య‌త్నం చేసినా.. దాన్ని నిలువ‌రించ‌టం మామూలే. ఇందుకు చంద్ర‌బాబు మిన‌హాయింపు కాదు. త‌న‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌శ్న‌లు అడిగే జ‌ర్న‌లిస్టుల‌ను కేసీఆర్ వ్యంగ్య‌స్త్రాలు సంధించి నోరు మూసే ప్ర‌య‌త్నం చేస్తే.. బాబు మాత్రం.. చిన్న‌పాటి అస‌హ‌నంతో.. అలాంటి ప్ర‌శ్న‌లు అడ‌గొద్దు బాస్ అన్న ఇండికేష‌న్లు ఇచ్చేస్తుంటారని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు చెబుతుంటారు.

ఇదంతా ఎందుకంటే.. చంద్ర‌బాబుకు ఢిల్లీ జ‌ర్న‌లిస్టుల పుణ్య‌మా అని ఈ రోజు చుక్క‌లు క‌నిపించాయి. రెండు రోజులు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా ఆయ‌న నాట‌కీయంగా వ్య‌వ‌హ‌రించిన తీరు కామెడీగా మారితే.. రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం గురించి చెప్పేందుకే త‌న తాజా ఢిల్లీ ప‌ర్య‌ట‌న అని చెప్పిన వైనంతో ఆయ‌న‌కు ఢిల్లీ జ‌ర్న‌లిస్టుల నుంచి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిసింది.

పార్ల‌మెంటుకు ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఉద‌యం స‌మావేశాల‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు పార్ల‌మెంటు భ‌వ‌నానికి వ‌చ్చిన సంద‌ర్భంలో విచిత్ర‌మైన రీతిలో ఫోజు ఇచ్చారు. నాడు మోడీ ప్ర‌ధాని హోదాలో పార్ల‌మెంటుకు వ‌చ్చిన‌ప్పుడు ఏ రీతిలో అయితే మెట్ల‌ను మొక్కారో అదే రీతిలో  ఫోజులు ఇచ్చారు. నాడు మోడీ పార్ల‌మెంటు మెట్ల‌ను మొక్కి త‌న దారిన తాను వెళ్లిపోతే.. బాబు మాత్రం తాను మొక్కిన వైనాన్ని కెమేరాల్లో బంధించేలా ఫోజులు ఇవ్వ‌టం కామెడీగా మారింది.ఫోటోలకు బాబు ఇచ్చే ప్రాధాన్య‌త తెలిసిన వారంతా న‌వ్వుకున్నారు.  

ఇదిలా ఉంటే.. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన విలేక‌రుల‌తో బాబు డాబు మాట‌లు చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఏపీకి జ‌రిగిన అన్యాయం గురించి మాట్లాడ‌టానికి ఢిల్లీకి వ‌చ్చిన‌ట్లు బాబు నోటి నుంచి విన్న వెంట‌నే విలేక‌రులు ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధించారు.

సార్‌.. ఏపీకి అన్యాయం జ‌రిగింద‌న్న మీరు నాలుగేళ్లు బీజేపీతో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?  కేంద్రం అడిగిన‌ట్లుగా రెవెన్యూ లోటు లెక్క‌లు చూపించ‌టం లేదెందుకు? ప‌్ర‌త్యేక హోదా కావాలంటున్న మీరు గ‌తంలో ఎందుకా ప్ర‌స్తావ‌న చేయ‌లేదు?  ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు? ఎన్డీయే నుంచి ఆక‌స్మాత్తుగా బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌త్యేక హోదా కోసం చేస్తున్న డిమాండ్ వెనుక ఏదైనా మ‌త‌ల‌బు ఉందా? అంటూ ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేయ‌టంతో.. బాబు సూటిగా స‌మాదానం చెప్ప‌లేక‌పోయారు.

క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌లు సంధించిన‌ప్పుడు త‌న‌కు బాగా అల‌వాటైన.. వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్ అనే మాట‌ను బ‌య‌ట‌కు తీసి.. ఒక్కొక్క మాట ఒత్తి ప‌లుకుతూ.. తన రోటీన్ ప్ర‌సంగాన్ని స‌మాధానాల రూపంలో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత‌కూ విలేక‌రుల ప్ర‌శ్న‌ల‌కు బాబు చెప్పిన స‌మాధానం మూడు ముక్క‌ల్లో చెప్పాలంటే.. బీజేపీని తాను న‌మ్మాన‌ని.. వారు మాత్రం త‌మ‌కు ద్రోహం చేశార‌ని.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం లాస్ట్ బ‌డ్జెట్ కోసం వెయిట్ చేసిన‌ట్లు చెప్పారు. ఒక‌వేళ‌.. అదే నిజ‌మైతే.. ప‌వ‌న్ స‌వాలు విసిరే వ‌ర‌కూ.. జ‌గ‌న్ అవిశ్వాస తీర్మానం పెడ‌తాన‌ని చెప్పే వ‌ర‌కూ బాబు త‌న నిర్ణ‌యాన్ని ఎందుకు ప్ర‌క‌టించ‌లేదంటారు?
Tags:    

Similar News