బాబు ప్ర‌త్య‌ర్థి, మాజీ ఐఏఎస్ అధికారి మృతి.. జ‌గ‌న్, కేసీఆర్‌ సంతాపం

Update: 2020-04-18 05:30 GMT
చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడును ఓట‌మి అంచుల వ‌ర‌కు తీసుకెళ్లిన నాయ‌కుడు, మాజీ ఐఏఎస్ డాక్ట‌ర్ చంద్ర‌మౌళి అనారోగ్యంతో శుక్ర వారం మృతిచెందారు. ఈ విష‌యం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌మౌళి సేవ‌ల‌ను కొనియాడారు.

చిత్తూరు జిల్లాకు చెందిన డాక్ట‌ర్ చంద్ర‌మౌళి 1990 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందారు. వైఎస్సార్ క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్‌గా, ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. 2013లో సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్ (సీడీసీ) డైరెక్ట‌ర్‌ గా ఉన్న స‌మ‌యంలోనే రాజ‌కీయాల‌పై ఆస‌క్తి తో వైఎస్సార్సీపీ అధినేత జ‌గ‌న్‌ ను సంప్ర‌దించారు. ఆయ‌న పార్టీలోకి ఆహ్వానం ప‌ల‌క‌డంతో వ‌లంట‌రీ రిటైర్‌మెంట్ తీసుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఆ క్ర‌మంలోనే 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కుప్పం అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గంలో చంద్ర‌బాబు నాయుడుపై పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో 55వేల ఓట్లు సాధించి స‌త్తా చాటారు. అదే క్ర‌మంలో 2019 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ చంద్ర‌బాబుకు తీవ్ర పోటీ ఇచ్చారు. 75వేల ఓట్లు రాబ‌ట్టి చివ‌ర‌కు ప‌రాజ‌యం పొందారు. ఆయ‌న ఎప్ప‌టి నుంచో క్యాన్స‌ర్‌ తో బాధ‌ప‌డుతున్నాడు. ఈ క్రమంలో ఆస్ప‌త్రి లో చికిత్స పొందుతూ శుక్ర‌వారం మృతి చెందారు.

అత‌డి మృతికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావుతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న సేవ‌లను కీర్తించారు. లాక్‌డౌన్ సంద‌ర్భంగా అంత్య‌క్రియ‌ల‌కు సీఎం జ‌గ‌న్ వెళ్ల‌లేక‌పోయిన‌ట్లు తెలిసింది.
Tags:    

Similar News