రేవంత్‌... అస‌లుసిస‌లు మ‌గాడ‌ట‌!

Update: 2017-11-01 13:01 GMT
మొన్న‌టిదాకా తెలుగుదేశం పార్టీలో కీల‌క నేత‌గా ఎదిగిన రేవంత్ రెడ్డి... తాజాగా మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి నేరుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్వ‌యంగా రేవంత్‌ కు రెడ్ కార్పెట్ స్వాగ‌తం ప‌లికారు. ఇదంతా బాగానే ఉన్నా.. టీడీపీకి రాజీనామా చేసిన స‌మ‌యంలో ఆ పార్టీ టికెట్‌ పై ద‌క్కిన శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేసి ప‌డేశారు. అంటే విలువ‌లు క‌లిగిన రాజ‌కీయాల‌కు తాను కేరాఫ్ అడ్రెస్ అన్న విష‌యాన్ని సూటిగా చెప్పేందుకే రేవంత్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశార‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయంగా వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టిదాకా విప‌క్ష పార్టీల టికెట్ల‌పై ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార పార్టీలో చేరిన నేత‌లెవ్వ‌రూ ఇప్ప‌టిదాకా రాజీనామా చేసిన దాఖ‌లా లేదు. ఈ విష‌యాన్ని దెప్పిపొడిచే ఉద్దేశ్యంతో పాటు తాను మ‌ళ్లీ పోటీ చేసి గెల‌వ‌గల‌న‌న్న దమ్మును అధికార పార్టీ నేత‌ల‌కు తెలియ‌జేసేందుకే రేవంత్ ఎమ్మెల్యే గిరీకి రాజీనామా చేశార‌ని కూడా ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

ఈ విష‌యాన్ని ఏ ఒక్క‌రు కూడా నిన్న‌టిదాకా పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి. అయితే తాజాగా రేవంత్ వేసిన ఈ డేరింగ్ స్టెప్‌ ను ఆస‌రా చేసుకుని టీ టీడీపీకి చెందిన ప్రముఖ నేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటకు చెందిన టీ టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు బూరుగుప‌ల్లి ప్ర‌తాప్‌ రెడ్డి కాసేప‌టి క్రితం ఘాటు కామెంట్లు చేశారు. రేవంత్ సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నార‌ని పేర్కొన్న ప్ర‌తాప్ రెడ్డి... మ‌రి ఇత‌ర పార్టీల టికెట్ల‌పై విజ‌యం సాధించి పార్టీలు మారిన నేత‌ల‌తో కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయించ‌లేక‌పోయార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అయినా రేవంత్ ధైర్య‌వంతుడ‌ని, ఆ ధైర్యంతోనే తాను విడిచి వెళుతున్న పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే ప‌ద‌విని తృణ‌ప్రాయంగా వ‌దిలేశార‌ని కూడా ప్ర‌తాప్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ చ‌ర్య‌తో ద‌మ్మున్న మ‌గాడిగా రేవంత్ రెడ్డి త‌న‌ను తాను నిరూపించుకున్నార‌ని, ఇలా మ‌గాడిగా నిరూపించుకునే స‌త్తా టీఆర్ ఎస్ నేత‌ల‌కు ఉందా? అని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు.

రేవంత్ త‌మ పార్టీని వీడినా కూడా ఆయ‌న తీసుకున్న సాహ‌సోపేత నిర్ణ‌యాన్ని టీ టీడీపీకి చెందిన ఓ ప్ర‌ముఖ నేత ఇంత‌లా కొనియాడారంటేనే... నిజంగానే రేవంత్ రెడ్డిని ధీరోదాత్తుడిగానే పేర్కొనాలి. ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన నాయకులను టీఆర్‌ ఎస్‌ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుమాలిన చర్య అని కూడా ప్ర‌తాప్ రెడ్డి అన్నారు. ఇలాంటి దిగజారుడు తనానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్పడడం శోచనీయమన్నారు. మగాళ్ళైతే ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన నాయకులు రాజీనామాలు చేసి తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని ఆయ‌న‌ సవాల్‌ విసిరారు. మూడున్నర ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్‌ ఎస్‌ పార్టీ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొత్తంగా చూస్తుంటే... రేవంత్ మ‌గ‌త‌నాన్ని అడ్డుపెట్టుకుని ప్ర‌తాప్ రెడ్డి... కేసీఆర్‌ ను చెడామ‌డా పీకేశార‌న్న‌మాట‌.
Tags:    

Similar News