ఇప్పుడేమంటావ్ ‘బాబూ’? లక్ష్మణ్ ప్రశ్నలు..

Update: 2018-05-15 08:37 GMT
దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఊహించని విజయం దక్కింది. బీజేపీ నేతలంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ కర్ణాటక ఫలితాలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దిరామయ్య చేసిన అవినీతియే కాంగ్రెస్ ఓటమికి కారణమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఈ ఫలితాలు చూస్తే అర్థమవుతోందన్నారు. రాహుల్ ప్రచారం చేసిన ప్రతీ చోట ఓడిపోయారని.. రాహుల్ నాయకత్వంపై పునరాలోచించుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఎగ్జిట్ పోల్స్ - మీడియా సంస్థలు - సర్వేలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినా తమపై ప్రజలు విశ్వాసం ఉంచారని.. మోడీ నాయకత్వాన్ని బలపరిచారని లక్ష్మణ్ అన్నారు.

పనిలో పనిగా చంద్రబాబు నాయుడిపై కూడా లక్ష్మణ్ విరుచుపడ్డాడు. ‘‘కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బాబు తన అనుచరులతో కలిసి బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చాడని.. కానీ వారి మాటలను కర్ణాటకలోని తెలుగు ప్రజలు నమ్మలేద’’న్నారు. బీజేపీ ఓడిపోవాలని బాబు భావించాడని.. కానీ ప్రజలకు బాబుపై కంటే బీజేపీపైనే నమ్మకం ఎక్కువన్నారు. ఇప్పటికైనా ఆంధ్రా ప్రజలు బాబు చేసే గిమ్మిక్కులు గమనించాలని కోరారు. ప్రత్యేక హోదాపై బాబు తప్పుడు ప్రచారాన్ని చేస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నాడని.. ప్రజలు బాబు అవినీతిని, కుటుంబ పాలనను గమనిస్తున్నారని.. 2019 ఎన్నికల్లో అందుకు తగ్గ ఫలితాన్ని చవిచూస్తాడని లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు.
Tags:    

Similar News