బీజేపీ మిష‌న్‌-19

Update: 2021-12-29 15:30 GMT
కేంద్రంలో వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ.. ఇప్పుడు అధికారంలో లేని రాష్ట్రాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింది. అందులో ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ఎప్ప‌టి నుంచో ఆ పార్టీ క‌న్నేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ప‌ట్టు కోసం చాలా కాలం నుంచి ప్ర‌య‌త్నిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఇప్పుడు తెలంగాణ‌లో ఆ పార్టీ జోరుమీదుంది.

ఇదే అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం త‌న‌దైన వ్యూహాలు, ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటుంది. గ‌ద్దె నెక్క‌డం కోసం బీజేపీ ప్ర‌త్య‌ర్థికి చెక్ పెట్టేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయ‌డంలో దిట్ట అన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా తెలంగాణ‌లో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల‌పై పార్టీ ప్ర‌త్యేక దృష్టి సారించింది.

ఆ 19 స్థానాల్లో..
తెలంగాణ‌లోని 19 ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపే ల‌క్ష్యంగా మిష‌న్‌-19 పేరుతో కార్య‌చ‌ర‌ణ చేప‌ట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధ‌మైంది. ఆ విష‌యాన్ని స్వ‌యంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా ఆ 19 స్థానాల‌కు గాను ఏడు చోట్ల గెలుస్తామ‌నే విశ్వాసాన్ని పార్టీ వ్య‌క్తం చేసింది.

ఆయా చోట్ల అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉంద‌ని దాన్ని అవ‌కాశంగా మ‌లుచుకోవాల‌ని పార్టీ భావిస్తోంది. ఆ ఎమ్మెల్యేల అవినీతి, అక్ర‌మాల‌కు వ్య‌తిరేకంగా పోరాడాల‌ని నిర్ణ‌యించింది. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు కోసం అనుస‌రించాల్సిన వ్యూహంపై ప్ర‌త్యేకంగా పార్టీ వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించింది.

వాళ్ల నియామ‌కంతో..
ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ఆ 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించే దిశ‌గా ప‌ని చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు బండి సంజ‌య్ పిలుపునిచ్చారు. ఆ నియోజ‌వ‌క‌ర్గాల‌కు ప‌రిశీల‌కుల‌ను నియ‌మిస్తామ‌న్నారు. వాళ్లు జ‌న‌వ‌రి 5 నుంచి 25 వ‌ర‌కు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. వ‌చ్చే నెల 30 లోగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో మంగ‌ల‌, పోలింగ్ బూత్‌, ప‌న్నా ప్ర‌ముఖ్‌ల క‌మిటీలు నియ‌మించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 7లోపు నియోజ‌క‌వ‌ర్గ కార్యాల‌యాలు, మార్చి 1 లోపు మండ‌ల కేంద్రాల్లో కార్యాల‌యాలు ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు.

ఏప్రిల్ 14న అంబేడ్క‌ర్ జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని సూచించారు. ద‌ళితుల త‌ర‌పున అండ‌గా నిల‌బడి పోరాడాల‌ని దిశానిర్దేశం చేశారు. ద‌ళిత బంధును ప్ర‌తి ఒక్క ద‌ళిత కుటుంబానికి అందించేలా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేందుకు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాల‌ని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా ద‌ళిత అదాల‌త్‌, భీమా జ్యోతి లాంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌నే ప్ర‌తిపాద‌న‌లు కూడా పార్టీ చేస్తోంది.




Tags:    

Similar News