టీడీపీ గెలుస్తుందన్నా అయ్యన్న ఎందుకు తిట్టాడు.?

Update: 2019-05-22 11:03 GMT
ఏపీలో అధికారం ఎవరిది.? అనే ప్రశ్నకు రేపు సమాధానం దొరుకుతుంది. అయితే ముందస్తుగా ఆదివారం ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ అధికారంలో వస్తుందని మెజార్టీ సర్వేలు చెప్పాయి. కానీ లగడపాటి మాత్రం టీడీపీయే గెలుస్తుందన్నాడు. దీనిపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేసి లగడపాటిపై ప్రశంసలు కురిపించగా.. వైసీపీ నేతలు మాత్రం లగడపాటిది ఫేక్ సర్వే అంటూ ఆడిపోసుకున్నారు.

అయితే అనూహ్యంగా టీడీపీ గెలుస్తుందని చెప్పినా కూడా టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మాత్రం లగడపాటిపై తీవ్ర విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే టీడీపీ గెలుస్తుందని చెప్పిన లగడపాటి.. నర్పీపట్నంలో మాత్రం అయ్యన్నపాత్రుడు ఓడిపోతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబుకు నివేదికలో చెప్పాడట.. దీంతో అగ్గిమీద గుగ్గిలం అయిన అయ్యన్న లగడపాటి సర్వేతో వచ్చిన అనర్థాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

లగడపాటి సర్వే విశ్వసనీయతను నమ్మి మొన్న తెలంగాణ ఎన్నికల వేళ 600 కోట్ల నుంచి వెయ్యికోట్ల దాకా బెట్టింగ్ లు కాశారని.. ఇళ్లు వాకిలి అమ్ముకొని మరీ డబ్బులు పందెం  కాశారని.. ఫలితం తేడా రావడంతో వారు రోడ్డున పడ్డారని అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఓ పెళ్లికి వెళితే తాము లగడపాటిని నమ్మి నిండా మునిగిపోయామని బాధను చెప్పుకున్నారని అయ్యన్న వివరించారు. అందుకే ప్రజల నాడి తెలియనవాళ్లు.. పనికిమలిన వాళ్లు ఎగ్జిట్ పోల్స్ చేస్తే ఇలానే ఇళ్లు వాకిలి అమ్ముకొని రోడ్డున పడుతారని.. అంతిమంగా ఫలితాలు వచ్చే వరకు ఎగ్జిట్ పోల్స్ ను నమ్మవద్దని అయ్యన్న స్పష్టం చేశారు.

ఇక అయ్యన్న సంచలన వ్యాఖ్యలు ఇప్పుడే కాదు.. గతంలో టీడీపీలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస్ రావుపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసి టీడీపీని ఇరుకునపెట్టారు. ఇప్పుడు లగడపాటి ఎగ్జిట్ పోల్స్ తో తెలుగు దేశం నేతలంతా ఆనందంగా ఉంటే.. అయ్యన్న మాత్రం విమర్శలతో హాట్ టాపిక్ గా మారారు.

    

Tags:    

Similar News