ఏపీ సీఎంవో నుంచి వారిద్దరు వెళ్లిపోతున్నారా?

Update: 2020-11-16 05:00 GMT
ఏపీ సీఎంవో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతల్ని నిర్వహించే ఇద్దరు అధికారులు.. తప్పుకోనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా సాగుతున్న ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడనున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు ముఖ్య అధికారులు సీఎంవో నుంచి బయటకు వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఆ  ఇద్దరు ఎవరు? ఏం చేస్తున్నారు?  ఇప్పుడు ఎక్కడకు వెళ్లనున్నారు? అన్న వివరాల్లోకి వెళితే..

ఏపీ సీఎం జగన్ కు ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏపీ కేడర్ కు చెందిన ఆయన గతంలో కేంద్ర సర్వీసులో పని చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

జగన్ సీఎం అయ్యాక ఆయన సీఎంవోకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లటంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన స్థానంలో.. ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎస్.ఎస్. రావత్ రానున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీ సర్కారుకు సలహాదారుగా వ్యవహరిస్తున్న పీవీ రమేశ్ సైతం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సలహాదారు పదవికే పరిమితం కాకుండా.. కొన్ని కీలక శాఖల బాధ్యతల్ని ఆయన చూశారు. ఈ సందర్భంగా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న అజేయ్ కల్లం వద్దనున్న శాఖల్నితీసేసి.. ఆ శాఖల్ని పీవీ రమేశ్ కు అప్పజెప్పారు.మళ్లీ వాటిని ఆయన వద్ద నుంచి తీసేసి అజేయ్ కల్లంకు అప్పగించారు. ఇలాంటివేళలో.. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News