కలకలం: కీసర భూవివాదం కేసులో మరో ఆత్మహత్య

Update: 2020-11-08 09:10 GMT
తెలంగాణలోనే సంచలనం సృష్టించిన కేసు ‘కీసర ఎమ్మార్వో భారీగా లంచం తీసుకొని దొరకడం’. ఏకంగా 1.10 కోట్లను లంచంగా తీసుకొని తహసీల్దార్ నాగరాజు ఏసీబీకి దొరికిపోయారు. ఈ కీసర భూ వివాదం కేసులో  అరెస్ట్ అయ్యి జైలుకెళ్లిన తహసీల్దార్‌ నాగరాజు ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఈ వివాదంలో అరెస్టయి ఇటీవలే బెయిలుపై వచ్చిన ధర్మరెడ్డి అనే వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది.

 హైదరాబాద్‌లోని కుషాయిగూడ వాసవినగర్‌ శివాలయంలోని చెట్టుకు ధర్మారెడ్డి ఉరివేసుకోవడం చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఆయన సూసైడ్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కీసర మండలంలోని రాంపల్లి గ్రామంలో రూ. 40 కోట్ల విలువచేసే 24 ఎకరాల 16 గుంటల భూమిని ధర్మారెడ్డి తమ బంధువుల పేర్ల మీద కీసర తహసీల్దార్‌ నాగరాజు సహాయంతో పట్టా చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీబీ  తహసీల్దార్‌ నాగరాజుతోపాటు ధర్మారెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  

కాగా ఈ భారీ అవినీతి కేసులో పెద్ద తిమింగళాలు ఉన్నాయన్న ప్రచారం జరగడం.. దీన్ని విచారిస్తే ఉన్నతాధికారుల గుట్టు కూడా బయటపడుతుందని బాధితులు ఆరోపించడంతో కేసు సంచలనమైంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న తహసీల్దార్ నాగారాజు, ధర్మారెడ్డిలు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
Tags:    

Similar News