'ఒక్క ఛాన్స్' ప్లీజ్‌: విజ‌య్ పిలుపు ఫ‌లించేనా?

ఇక‌, త‌న పార్టీ త‌రఫున ఎక్కువ మంది యువ‌త‌కు విజ‌య్ టికెట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా చెన్నైలో విజ‌య్ స‌భ నిర్వ‌హించారు.;

Update: 2026-03-30 06:38 GMT

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరాటాన్ని ఎంచుకున్న ప్ర‌ముఖ న‌టుడు, ద‌ళ‌ప‌తి విజ‌య్.. ఒక్క ఛాన్స్ పిలుపుని చ్చారు. త‌న సొంత పార్టీ త‌మిళ వెట్రిక‌గ‌ళం(టీవీకే) త‌ర‌ఫున పార్టీ అభ్య‌ర్థుల‌ను ఆయ‌న ఆదివారం ప్ర‌క‌టించారు. తాను స్వ‌యం గా రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచిపోటీ చేయ‌నున్నారు. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇక‌, త‌న పార్టీ త‌రఫున ఎక్కువ మంది యువ‌త‌కు విజ‌య్ టికెట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా చెన్నైలో విజ‌య్ స‌భ నిర్వ‌హించారు.

స‌వాళ్లు ఎన్నో..

విజ‌య్ పిలుపు గ‌తంలో 2019లో ఏపీలో జ‌గ‌న్ ఇచ్చిన పిలుపు `ఒక్క ఛాన్స్` అన్న‌ట్టే ఉందని ఏపీ స‌రిహ‌ద్దు ప్రాంతాల త‌మి ళులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుంటే.. అస‌లు విజ‌య్ ఒక్క ఛాన్స్ పిలుపు ఏమేర‌కు ఫ‌లిస్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. గ‌తంలో మాదిరిగా త‌మ అభిమాన హీరోలు పార్టీలు పెట్ట‌గానే హ‌త్తుకుని.. అల్లుకుని ఓట్లు రాల్చే సంస్కృతికి త‌మిళులు ఎప్పుడో మంగ‌ళం పాడేశారు. అందుకే డీఎండీకే అధినేత‌, త‌మిళ‌లు ఎంతో ప్రేమించిన విజ‌య్‌కాంత్ పార్టీ పెట్టినా.. ఆయ‌న‌ను ప్ర‌జ‌లు అక్కున చేర్చుకోలేదు. ఆయ‌ననే ఓడించారు. గత కొన్నాళ్ల కింద‌ట విజ‌య్‌కాంత్ మృతి చెందారు.

ఇక‌, క‌మ‌ల్ హాస‌న్ పార్టీ `మ‌క్క‌ల్ నీధి మ‌య్యం`ని కూడా ప్ర‌జ‌లు ఆద‌రించ‌ని విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న అధికార డీఎంకేతో పొత్తు పెట్టుకుని రాజ్య‌స‌భ సీటుకు ప‌రిమితం అయ్యారు. ఒక్క వీరే కాదు.. అనేక మంది రాజ‌కీయంగా వెలుగులోకి రాలేక పోయారు. ఇలాంటి స‌మ‌యంలో విజ‌య్ ఒక్క ఛాన్స్‌ను ప్ర‌జ‌లు ఎలా అర్థం చేసుకుంటార‌న్న‌ది చూడాలి. మ‌రోవైపు.. విజ‌య్‌కి రాజ‌కీయంగా ఎలాంటి అనుభ‌వం లేద‌న్న వాద‌నను డీఎంకే స‌హా.. బీజేపీ బ‌లంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్తున్నా యి. అంతేకాదు.. క‌రూర్‌లో జ‌రిగిన దుర్ఘ‌ట‌న తాలూకు విషాదాన్ని ప్ర‌జ‌ల‌కు ఈ రెండు పార్టీలు గుర్తు చేస్తున్నాయి.

మ‌రోవైపు.. విజ‌య్ స‌తీమ‌ణి వ‌ర్సెస్ వివాహేత‌ర సంబంధం వ్య‌వ‌హారం కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య పెద్ద ఎత్తున ప్ర‌చారంలో ఉంది. ఇలా.. కీల‌క అంశాలు విజ‌య్‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నాయి. అంతేకాదు.. స్థానికంగా ఉన్న మ‌రుమ‌లార్చి ద్ర‌విడ మున్నెట్ర క‌ళ‌గం వంటి పార్టీలు.. విజ‌య్‌.. బీజేపీ ఒక్క‌టేన‌ని ప్ర‌చారం చేస్తున్నాయి. విజ‌య్‌కు అనుభవం లేద‌నే వారు..అదేస‌మ‌యంలో ఆయ‌న త‌న ఆస్తిని నిల‌బెట్టుకునేందుకు మాత్ర‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌నే వారు పెరుగుతున్నారు. వీటితోపాటు విజ‌య్‌కు ఉన్న మ‌రో మైన‌స్‌.. క్రిస్టియానిటీ ముద్ర‌. విజ‌య్ స‌హ‌జంగానే క్రిస్టియ‌న్‌.

దీంతో బీజేపీ, అన్నాడీఎంకేల కూట‌మి.. హిందువుల ఓటు బ్యాంకును ల‌క్ష్యంగా చేసుకుని.. విజ‌య్‌ను ఒక వ‌ర్గానికే ప‌రిమితం చేస్తూ.. వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నాయి. ఇక‌, యూత్‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నా.. వీరు ఎంత‌వ‌ర‌కు ఓట్లు వేస్తారు? అనేది ప్ర‌శ్న‌గా మారింది. మొత్తంగా ఒక్క ఛాన్స్ పిలుపు బాగున్నా.. విజ‌య్‌కు ఏమేర‌కు ప్ల‌స్ అవుతుంద‌న్న‌ది సందేహ‌మేన‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో చ‌తుర్ముఖ పోరు నెల‌కొన్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News