మహమ్మారి దెబ్బ : దేశవ్యాప్తంగా మరో 18 కోట్ల మంది పేదరికంలోకి

Update: 2020-07-04 06:00 GMT
దేశంలో వైరస్ వ్యాప్తి ప్రజల జీవితాలతో పాటు వారి ఆర్థిక స్థితిగతులనూ తిరోగమనం లోకి నెట్టేసింది. ఈ మహమ్మారి నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ దేశవ్యాప్తంగా ప్రతి 10 మందిలో 8 మంది ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందని, దేశంలోని 84 శాతం కుటుంబాలు లాక్‌ డౌన్‌ సమయంలో ఆదాయం కోల్పోయాయని తాజా అధ్యయనంలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో, సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంయుక్తంగా ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ వరకు నిర్వహించిన ఈ సర్వే దేశ ప్రజల పై, వారి ఆర్థిక పరిస్థితి పై వైరస్ చూపిన ప్రభావాన్ని బట్టబయలు చేసింది.

27 రాష్ట్రాల్లో 6 వేలకుపైగా కుటుంబాలపై కన్జూమర్‌ పిరమిడ్స్‌ హౌస్‌ హోల్డ్‌ సర్వే జరిపింది. ఈ సర్వే ప్రకారం వైరస్‌ ప్రభావం దేశంలోని దిగువ మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎక్కువ ఆదాయాన్ని ఈ వర్గాలు కోల్పోగా వ్యవసాయంపై ఆధారపడ్డ పేద వర్గాల ఆదాయంలో పెద్దగా మార్పు రాలేదు అని తెలిపింది.  గ్రామీణ ప్రాంతాల్లో 88 శాతం కుటుంబాలపై ఎఫెక్ట్‌ కనిపిస్తే, పట్టణ ప్రాంతాల్లో అది 75 శాతం కుటుంబాలపై ప్రభావం చూపింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి ప్రతి కుటుంబం నెలకు ఆర్జించే ఆదాయంలో రూ. 3,801 నుంచి రూ. 1,01,902 వరకు కోల్పోవాల్సి వచ్చిందని ఈ సర్వే  తెలిపింది.

ఈ వైరస్ వల్ల ..  ముఖ్యంగా బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో 90–100 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోగా తెలంగాణలో దేశంలోనే అత్యల్పంగా 50–70 శాతం, ఆంధ్రప్రదేశ్ ‌లో 60–70 శాతం కుటుంబాల ఆదాయంలో తగ్గుదల కనిపించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో 70–80 కుటుంబాల రాబడి తగ్గింది. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ఎత్తేశాక నిరుద్యోగిత రేటు మార్చి నెల స్థాయికి పరిమితం కావడం ఊరట కలిగిస్తోంది. మార్చి 22న దేశంలో నిరుద్యోగిత రేటు 8.4 శాతం ఉండగా మే 3 నాటికి అది అత్యధికంగా 27 శాతానికి చేరి జూన్‌ 21 నాటికి మళ్లీ 8.5 శాతానికి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పేదరిక గణాంకాలు పెరిగిపోతున్నాయి. వైరస్ ప్రభావంతో 1990 నాటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉందని యూఎన్‌ యూనివర్సిటీ వరల్డ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌ మెంట్‌ ఎకనామిక్స్‌ రీసెర్చ్‌ ఇటీవలి ప్రచురణలో వెల్లడించింది. రోజుకు ఒక వ్యక్తి 1.9 డాలర్లకన్నా తక్కువ సంపాదన ఉన్న వారిని పేదలుగా గుర్తిస్తే ఆ లెక్కన ప్రపంచ జనాభాలో 17 కోట్ల మంది పేదరికంలోకి వెళ్తారని తెలిపింది.
Tags:    

Similar News