అక్కడ గ్రామ వాలంటీర్ల పోస్టులను అమ్ముకుంటున్నారు!

Update: 2019-07-20 01:30 GMT
గ్రామీణ ప్రాంతంలో యువతకు ఉపాధిని కల్పించడానికి జగన్ మోహన్ రెడ్డి గ్రామ వాలంటీర్ల వ్యవస్థను మొదలుపెట్టారు. గ్రామాల్లో ఉన్న యువతకు ఊరికే నిరుద్యోగభత్యాలు అంటూ డబ్బులు ఇవ్వకుండా - వారు చేయడానికి పనిని కూడా ఇస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.

గౌరవ వేతనంతో వారికి ఉపాధి లభిస్తూ ఉంది. అటు ప్రజలకు కూడా వారు ఉపయోగపడే అవకాశం ఉంది. జన్మభూమి కమిటీల్లా కాకుండా.. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్ మోహన్ రెడ్డి యువతకు ఉపాధి కల్పించడంతో పాటు - ప్రజలకు ప్రభుత్వం ద్వారా పనులు తేలికగా జరిగిపోయే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ సంగతలా ఉంటే.. కొన్ని చోట్ల మాత్రం అందులో అక్రమాలు తప్పడం లేదని తెలుస్తోంది. అందుకు ఉదాహరణ గిద్దలూరు నియోజకవర్గం. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మనుషులు వాలంటీర్ల పోస్టులను అయిన కాడికి అమ్ముకుంటున్నారని తెలుస్తోంది.

పార్టీకి పని కొచ్చే వాళ్లను - ప్రజలకు పనికి వచ్చే వాళ్లను కాకుండా.. తమకు తెలిసిన వారికే ఆ వాలంటీర్ల పోస్టులు ఇప్పించుకుంటున్నారట అన్నా రాంబాబు మనుషులు. వారితో కూడా డబ్బులు ఇప్పించుకుంటున్నారని - ఒక్కో పోస్టుకు 50 వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారని  సమాచారం.

ఒక సదుద్దేశంతో ఏర్పడుతున్న వ్యవస్థను ఇలా అన్నా రాంబాబు మనుషులు దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 
Tags:    

Similar News