తనను కాదు.. కేసీఆర్ ను అడగండి: మంత్రి పేర్ని నాని

Update: 2020-10-02 05:01 GMT
తెలుగు రాష్ట్రాల మధ్య పలు వివాదాల పరిష్కారం తమ చేతుల్లో ఏం లేదని.. అంతా కేసీఆర్ చేతుల్లోనే ఉందని ఏపీ మంత్రి పేర్ని నాని చేతులెత్తేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడం.. జలవివాదాల పరిష్కారం గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ నే అడగాలని విలేకరుల ప్రశ్నకు బదులిచ్చారు. వివాదాలకు కేసీఆర్ కారణమని పరోక్షంగా నాని బంతిని ఆయన కోర్టులోకి నెట్టేశారు.

పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఏపీకి ఉన్న వివాదాల గురించి మంత్రి పేర్ని నాని ఆసక్తికరంగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలపై ప్రతిష్టంభణ తొలగించేందుకు ఇటీవలే రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు హైదరాబాద్ లో సమావేశమైనా అందులో ఏం తేలలేదు.

లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో కేంద్రం బస్సుల అంతర్రాష్ట్ర రవాణాకు అనుమతిచ్చింది. కానీ రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చించినా ఫలితం రాలేదు.

నష్టాల పేరుతో సర్వీసులు తగ్గిస్తామని తెలంగాణ.. బస్సు సర్వీసులు పెంచుతామని ఏపీ ప్రతిపాదిస్తోంది. ఈ క్రమంలోనే రెండు ఆర్టీసీల మధ్య ఈ పంచాయితీ తెగడం లేదు.

ఈ వివాదంపై మాట్లాడిన మంత్రి పేర్ని నాని వివాదం పరిష్కారం కాకపోవడానికి కారణం కేసీఆర్ సర్కారేనంటూ తనను అడగవద్దని విలేకరుల సమావేశంలో కుండబద్దలు కొట్టడం విశేషం.
Tags:    

Similar News